అవినాష్ పై సుప్రీంకు సునీత - ముందస్తు బెయిల్ పిటీషన్ పై..!!
ఎంపీ అవినాష్ రెడ్డి వర్సస్ వైఎస్ సునీత. ఇప్పుడు వీరిద్దరి లీగల్ ఫైట్ సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ పిటీషన్ పైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ ను అరెస్ట్ చేయవద్దని సీబీఐని అదేశించింది. సీబీఐ కు సహకరించాలని అవినాష్ కు సూచించింది. ఇప్పుడు దీని పైన సునీత సుప్రీంకోర్టను ఆశ్రయించారు.
వైఎస్ సునీత వర్సస్ అవినాష్ రెడ్డి : వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. అవినాష్ పైన సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దీని పైన ఇప్పటికే నాలుగు సార్లు విచారణ చేసింది. అయిదో సారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ సమయంలో అవినాష్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఎంపీని అరెస్ట్ చేస్తారా అని సీబీఐని కోర్టు ప్రశ్నించింది.
దీనికి సమాధానంగా అవసరమైతే అరెస్ట్ చేస్తామని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. దీనికి కొనసాగింపుగా అవినాష్, సీబీఐ తరపు న్యాయవాదుల మధ్య వాదనలు సాగాయి. ఈ పిటీషన్ లో వైఎస్ సునీత ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ ను కోర్టు అనుమతింది. సునీత తరపు న్యాయవాది అవినాష్ కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు.

హైకోర్టు ఆదేశాల పై సుప్రీంకు : తన మీద రాజకీయ కుట్రలో భాగంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ ఆరోపించారు. హత్యతో తనకు సంబంధం లేదన్నారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా తమ పైన ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు వెనుక కుటుంబ పరమైన ఆర్దిక, అక్రమ సంబంధాలు కారణంగా పేర్కొన్నారు. నిందితుడు తల్లిని వివేకా లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
వివేకా రెండో భార్య కుమారుడికి ఆస్తులు ఇవ్వాలని వివేకా భావించారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సునీత లాయర్ కేసులో అవినాష్ ప్రమేయం ఉందని వాదించారు. దస్తగిరి కూడా ఈ విషయాన్ని చెప్పిన అంశాన్ని కోర్టు ముందు గుర్తు చేసారు. సీబీఐ ఈ కేసులో 40 కోట్ల డీల్ జరిగినట్లు చెప్పుకొచ్చింది.

సుప్రీంలో రేపు విచారణ :ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ ను అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు ఆదేశాల పైన సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేసారు. వెంటనే విచారణకు తీసుకోవాలని సునీత తరపు న్యాయవాది కోరారు. ఈ నెల 25న కేసులో హైకోర్టు తీర్పు రానుందని చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరులోగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉందని ప్రస్తావించారు.
దీంతో, రేపు (శుక్రవారం) సునీత పిటీషన్ పైన సుప్రీం చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టనుంది. దీంతో, సుప్రీం తీర్పు ఆధారంగా అవినాష్ విచారణలో సీబీఐ ముందుడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠను పెంచుతోంది.












Click it and Unblock the Notifications