YS Avinash Reddy : వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరో నోటీసు- 24న విచారణకు రమ్మంటూ..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే కడప నుంచి హైదరాబాద్ కు బదిలీ అయిన ఈ కేసు విచారణ కోసం ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులిచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. కడప నుంచి హైదరాబాద్ కు ఈ కేసు విచారణ బదిలీ అయిన నేపథ్యంలో వేగం పెంచిన సీబీఐ.. ఇప్పటికే నిందితుల్ని మరోసారి విచారించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓసారి విచారించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మళ్లీ విచారణకు పిలిచింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
గత నెల 28న వివేకా కేసులో తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డిని దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం మరోసారి అవసరమైతే పిలుస్తామని కూడా చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అప్పుడు చెప్పిన ప్రకారమే ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 24న హైదరాబాద్ లో విచారణకు రావాలని కోరింది. వైఎస్ అవినాష్ రెడ్డికి ఈసారి సీబీఐ.. వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు. ఈనెల 24న మధ్యాహ్నం 3గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

వివేకా కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితుల్ని సీబీఐ అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు బెయిల్ తెచ్చుకున్నారు. మిగతా వారిని సీబీఐ కోర్టు తాజాగా చంచల్ గూడ జైలుకు పంపింది. వీరిని కడప జైలు నుంచి తెచ్చి సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణ తర్వాత వారిని చంచల్ గూడకు పంపారు. త్వరలో సీబీఐ కోర్టు మరోసారి ఈ కేసులో విచారణ జరపబోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి సీబీఐ తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications