వివేకా హత్యకేసుపై సుప్రీంకోర్టులో కీలక పిటీషన్లు- సునీత ఇంప్లీడ్
కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో- ఈ కేసులో నిందితులుగా ఉన్న శివశంకర్రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి సవాల్ చేశారు. వారిద్దరూ పిటీషన్లను దాఖలు చేశారు.
వాటిని ఈ మధ్యాహ్నం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వచ్చాయి ఈ పిటీషన్లు. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత ఇందులో ఇంప్లీడ్ అయ్యారు. హతుడు తన తండ్రేనని, ఈ కేసులో తాను బాధితురాలినని వివరించారు. తన వాదనలను ఆలకించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రారంభ వాదనలను ఆలకించిన తరువాత ధర్మాసనం ఈ కేసుపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న డ్రైవర్ దస్తగిరి.. ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడం వల్ల న్యాయ సహాయం అందించాలంటూ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్కు విజ్ఞప్తి చేశారు.
వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ పీఏ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టు ఆశ్రయించారు. వివేకా హత్యపై మొదట ఫిర్యాదు చేసింది తానేనని ఆయన ఈ పిటీషన్లో పొందుపరిచారు. కృష్ణారెడ్డి చేసిన అభ్యర్థనను వ్యతిరేకించిన సునీత.. తాజా పిటీషన్లల్లో ఇంప్లీడ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిజానికి- వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తును జూన్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన నేపథ్యంలో ఈ కేసుపై విచారణ ఇక దాదాపు తుదిదశకు చేరుకున్నట్టే. ఈ దశలో ముగ్గురు నిందితుల పాత్ర ఏమిటనే విషయంపై సీబీఐ ఇప్పటికే ఫైనల్ ఛార్జిషీట్ను దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications