వివేకా కుటుంబానికి ప్రాణహాని-కడప ఎస్పీకి కుమార్తె సునీత ఫిర్యాదు- ఇంటి వద్ద చక్కర్లు
ఏపీలో దాదాపు మూడేళ్ల క్రితం సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసును త్వరలో ఛేదించేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అరెస్టుల పర్వం కూడా మొదలైంది. దీంతో పాటే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులకు ప్రాణహాని కూడా పెరుగుతోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రాణహాని పొంచి ఉందని ఆరోపిస్తూ కడప జిల్లా ఎస్పీకి ఆయన కుమార్తె సునీతారెడ్డి ఇవాళ లేఖ రాశారు. రెండు రోజుల క్రితం తమ ఇంటి చుట్టూ ఓ వ్యక్తి చక్కర్లు కొట్టాడని, ఇంటి కాంపౌండ్ తర్వాతి తలుపు దగ్గర నిలబడి కాల్స్ కూడా చేశాడని సునీతారెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. సీబీఐ తాజాగా ప్రశ్నిస్తున్న శివశంకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కటౌట్ పై ఉన్న వ్యక్తిలాగే ఈ వ్యక్తి ఉన్నాడని సునీత ఆరోపించారు.. ఈ విషయాన్ని స్దానిక సీఐకి ఫిర్యాదు చేస్తే అతన్ని మణికంఠరెడ్డిగా గుర్తించారన్నారు.
తన తండ్రి హత్య కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డికి ఈ మణికంఠరెడ్డి సన్నిహితుడని, కాబట్టి శివశంకర్ రెడ్డి పాత్రను సీబీఐ త్వరగా తేల్చాలని కూడా ఆమె కోరారు. మరోవైపు ఇవాళ సీబీఐ విచారణకు శివశంకర్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో సునీతారెడ్డి ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో అధికారుల్ని తరచూ కలుస్తున్న సునీతారెడ్డి ఇవాళ చేసిన ఆరోపణలతో ఈ కేసులో మరో ట్విస్ట్ గా మారింది. వివేకా హత్య కే్సులో సునీతారెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాల్ని కూడా రికార్డు చేస్తున్న సీబీఐ అధికారులు.. వారికి భద్రత కల్పించే విషయంలో మాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది. దీంతో స్ధానిక పోలీసుల్ని ఆమె ఆశ్రయిస్తున్నారు. గతంలోనూ సునీతారెడ్డి కడప ఎస్పీకి ఫిర్యాదులు చేసినా వారి నుంచి కూడా తగిన స్పందన లభించడం లేదని తెలుస్తోంది. దీంతో తాజా పరిణామాలతో వివేకా కుటుంబానికి ముప్పు పెరుగుతోంది.