తప్పుడు పత్రాలు: వైఎస్ జగన్ బాబాయ్ వివేకా తోడల్లుడి అరెస్టు
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాబాయ్, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తోడల్లుడు సుధాకర్రెడ్డిని చీటింగ్ కేసులో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మృతుల పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి ఆరు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసులో ఆ అరెస్టు జరిగింది.
ఆ ఘటనపై కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ సుబ్బరాయుడు ఫిర్యాదుపై వైఎస్ వివేకానందరెడ్డి తోడల్లుడు సుధాకర్రెడ్డి, ఆయన కుమారుడు సుజిత్రెడ్డి సహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు మంగళవారం సుధాకర్రెడ్డిని అరె స్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.
పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండల కేంద్రం సీకేదిన్నె వాసి పఠాన్ దాదాపీర్, హుస్సేన్బీ దంపతులు. వీరిలో హుస్సేన్బీ పేరిట సీకేదిన్నె మండలం కొలుములపల్లె రెవెన్యూ పొలం సర్వే నెం.807 /2-1, 808లో ఆరెకరాల పొలం ఉంది.
హుస్సేన్బీ 2010లో మరణించింది. దాదాపీర్ కువైట్లో ఉంటున్నాడు. దీంతో భూమిని ఎవరూ సాగు చేయడం లేదు. అది గమనించిన వైఎస్ వివేకా తోడల్లుడు సుధాకర్రెడ్డి 2012లో హుస్సేన్బీ నుంచి స్థలం కొన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించి న సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తప్పుడు పత్రాలు సృష్టించి దాన్ని కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని విచారణలో తేలింది. దీంతో ఆరుగురిపై కేసు నమోదు చేశా రు. సుధాకర్రెడ్డి పులివెందుల లయోలా కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఈయన గతంలో మాజీమంత్రి బొత్స సత్యనారాయణ కు పీఏగా పనిచేశారు.
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఓఎస్డీగా కూడా పనిచేశారు. ఈయన కుమారుడు సుజిత్రెడ్డి అమెరికాలో ఉంటున్నారు. గతంలో ఇదే పొలానికి సంబంధించి కేసు నమోదైంది.