సీబీఐకి అందుకే నిజం చెప్పేశా-జగన్, అవినాష్ రాజీనామా చేస్తారా- దస్తగిరి కామెంట్స్..
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ జరుపుతున్న దర్యాప్తు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉండి, ఆ తర్వాత అప్రూవర్ గా మారిన వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిపై తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దస్తగిరిని అప్రూవర్ గా మార్చింది సీబీఐయేనని, ఆయన చెప్పినదాని ప్రకారమే తనను నిందితుడిగా మార్చారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఇవాళ దస్తగిరి స్పందించారు.
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో ప్రెస్ మీట్ పెట్టిన దస్తగిరి.. వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలపై స్పందించారు. గతంలో తాను అప్రూవర్ గా మారినప్పుడు అవినాష్ ఎందుకు స్పందించలేదని, అప్పట్లో మంచివాడుగా ఉన్న తాను, ఇప్పుడు తన వరకూ వచ్చేసరికి చెడ్డవాడినయ్యానా అంటూ అవినాష్ ను ప్రశ్నించారు. గతంలో డబ్బుకు ఆశపడి ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు చేశామని, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు కాబట్టే సీబీఐకి నిజం చెప్పేశానన్నాడు.

అంతటితో ఆగకుండా వైఎస్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి దస్తగిరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పలుకుబడి ఉందని సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ ను మార్చేశారని, కానీ కొత్త టీమ్ వచ్చి కొత్త కోణంలో విచారిస్తుందా అని ప్రశ్నించారు. ఈ కేసులో మీ పాత్ర తెలుసు కాబట్టి ఎవరైనా అలాగే దర్యాప్తు చేస్తారన్నారు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని, పులివెందుల వైఎస్ జయమ్మ కాలనీలోనే ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని దస్తగిరి తెలిపారు. తాను తప్పు చేస్తే జైలుకెళ్తానని, మీరు తప్పుచేసినట్లు రుజువైతే జగన్, అవినాష్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications