బెదిరిస్తే..: బాబుకు జగన్ పార్టీ ఎమ్మెల్యే హెచ్చరిక
గుంటూరు: బెదిరించి రాజధాని కోసం భూములు తీసుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునే పరిస్థితి లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి శుక్రవారం హెచ్చరించారు. రైతులను బెదిరించి భూములు లాక్కుంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
తుళ్లూరులో రైతులు ఎక్కువ నష్టపరిహారం కోరుతున్నారని ఆర్కె చెప్పారు. మంగళగిరి రైతులు భూమిని ఎట్టి పరిస్థితుల్లోను ఇచ్చేది లేదని చెబుతున్నారని తెలిపారు. 23వేల ఎకరాల భూమిని సేకరించామని ప్రభుత్వం చెబుతోందని, తాము మరో 15వేల ఎకరాలు చూపిస్తే రాజధాని నిర్మాణాలు ప్రారంభిస్తారా అని ప్రశ్నించారు.
చంద్రబాబుపై బొత్స నిప్పులు
ఏపీ సీఎం చంద్రబాబు పైన పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వ పాలన జరగడం లేదని, రాజకీయ వ్యాపారమే జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు నేరుగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు.
జపాన్, సింగపూర్ దేశాలకు వెళ్లి ఎవరెవరితో మాట్లాడారో పరిశీలిస్తే ఆయన జైలుకు వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబు పైన వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇప్పటి వరకు విచారణ జరగలేదన్నారు. విచారణ జరగకుండా ఆయన స్టే తెచ్చుకున్నారన్నారు. రాజధాని నిర్మాణంలో పారదర్శకత లోపించిందని దుయ్యబట్టారు. విచారణ జరిపితే చంద్రబాబు దందాలు, వ్యాపారాలు బయటకు వస్తాయన్నారు.