వైఎస్ విజయమ్మను తప్పించేందుకే ప్లీనరీ: సోమిశెట్టి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ఆ పదవి నుంచి తప్పించేందుకే ప్లీనరీ నిర్వహించారని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్లీనరీవల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? అనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సోమిశెట్టి ప్లీనరీ జరిగిన తీరుపై నిప్పులు చెరిగారు. సమావేశాల్లో ఏ వర్గానికి మేలు జరిగేలా ఒక్క తీర్మానం కూడా చేయలేకపోయారని, విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కనీసం తీర్మానం కూడా చేయలేకపోయారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు సొంత చెల్లిని పక్క రాష్ట్రానికి పంపించారని, ఇప్పుడు తల్లిని పంపించేందుకే పార్టీ నుంచి తప్పించారని ఆరోపించారు.
తమ నేత చంద్రబాబు నిర్వహించిన మహానాడుకు ప్రజలంతా సొంత వాహనాల్లో తరలివచ్చారని, వైసీపీ ప్లీనరీకి మాత్రం ఆర్టీసీ బస్సుల్లో ప్రజలను బలవంతంగా తరలించారన్నారు. రోడ్లపై ఉండే చిన్న చిన్న గుంతలను కూడా పూడ్చగలిగే పనులు చేపట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, అయినా తామేదో గొప్పలు చేశామని చెప్పుకోవడం మాత్రం వారికే చెల్లించదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిత్యం పరితపించే తమ నేత చంద్రబాబునాయుడిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.