జగన్ పాదయాత్ర వాయిదా వెనుక అసలు కథ ఇదీ: జిమ్మిక్కు లేదు, ప్లానూ కాదు!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వాయిదా వెనుక కారణం ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. పాదయాత్ర 6 నెలల పాటు కొనసాగనుంది
ఆమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వాయిదా వెనుక కారణం ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. పాదయాత్ర 6 నెలల పాటు కొనసాగనుంది.
హఠాత్తుగా వైయస్ జగన్ పాదయాత్ర వాయిదా, కారణాలివే: 'అసలేం జరిగింది'
మొదటి వారానికి వాయిదా
అక్టోబర్ 27వ తేదీన పాదయాత్ర ప్రారంభించాలని వైయస్ జగన్, వైసిపి నేతలు తొలుత నిర్ణయించారు. ఈ మేరకు జగన్ ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు నవంబర్ మొదటి వారంలో పాదయాత్ర ప్రారంభించేందుకు వైసిపి సిద్ధమవుతోంది.
ప్రశాంత్ కిషోర్ వ్యూహం ప్రకారమే..
ఎన్నికలు మరో ఏడాదిన్నర మాత్రమే ఉన్నందున పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలనే ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగన్ అదే దారిని ఎంచుకున్నారు.
దెబ్బకొట్టిన కోర్టు
అక్రమాస్తుల కేసులో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. పాదయాత్ర నేపథ్యంలో తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయస్థానాన్ని కోరగా, నో చెప్పింది. దీంతో ఆయన ప్రతి శుక్రవారం కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
ఇదీ అసలు విషయం
ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిన జగన్.. అక్టోబర్ 27న.. అంటే శుక్రవారమే పాదయాత్ర ప్రారంభం పెట్టుకున్నారు. పాదయాత్ర ప్రారంభమే శుక్రవారం కావడం, అదే రోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో జగన్, వైసిపి నేతలు పాదయాత్రను వాయిదా వేయనున్నారని తెలుస్తోంది.
నవంబర్ మొదటి వారంలో ప్రారంభం
జగన్ పాదయాత్ర వాయిదాపడే అంశంపై వివిధ రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆ రోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున పాదయాత్రను నవంబర్ 1న లేదా 2న ప్రారంభించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి అవుతారా?
కానీ, దీనిపై ఆసక్తికర ప్రచారం సాగుతోంది. అక్టోబర్ 27వ తేదీన బాగా లేదని, జ్యోతిష్యులు జగన్కు చెప్పారని, అందుకే ఆయన తన పాదయాత్రను వాయిదా వేసుకుంటున్నారని కొందరు అంటుంటే.. 27న బాగా లేదని, ఆ తర్వాత ఎప్పుడైనా పాదయాత్ర ప్రారంభిస్తే ముఖ్యమంత్రి అవుతారని జగన్కు పండితులు చెప్పారని, అందుకే వాయిదా వేసుకున్నారని మరికొందరు అంటున్నారు.
వైసిపి జిమ్మిక్కు, టిడిపి పన్నాగం?
కానీ అసలు విషయం.. ప్రారంభం ప్రారంభమే అటు కోర్టుకు హాజరుకావడం, ఇటు పాదయాత్ర ప్రారంభించడం ఇబ్బంది కాబట్టే వాయిదా వేసుకుంటున్నారని తెలుస్తోంది. కోర్టుకు హాజరయ్యే రోజు కాబట్టి వాయిదా వేసుకున్నామని చెబితే బాగుండదు కాబట్టి వైసిపి వ్యూహాత్మకంగా పండితులు, జ్యోతిష్యులు అని తెరపైకి తెచ్చిందని కొందరు అంటుంటే, టిడిపి అనుకూలురు జగన్ను బద్నాం చేసేందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని వైసిపి అనుకూలురు అంటున్నారు.