విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరు తీవ్రం: హస్తిన వేదికగా: జీరో అవర్ నోటీస్
అమరావతి: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న ప్రతిష్ఠాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు నిరసనగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది. విశాఖపట్నంలో క్షేత్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు.. ఇక హస్తిన వేదికగా తమ పోరాటాన్ని ఉధృతం చేయనున్నారు. పార్లమెంట్లో నిరసనలను తెలియజేస్తున్నారు.
గంటాకు ఎసరు: పొమ్మనలేక పొగ: ఓటమికి ఆయనే బాధ్యుడు: చంద్రబాబుకు విశాఖ నేతల ఘాటు లేఖ
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవైేటీకరించాలనే ప్రతిపాదనలను నిరసిస్తూ సోమవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ సభ్యులు.. దాన్ని కొనసాగిస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలనే డిమాండ్ చేస్తూ రాజ్యసభలో మంగళవారం కూడా తమ నిరసన గళాన్ని వినిపించనున్నారు. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ సభాపక్ష నాయకుడు వీ విజయసాయి రెడ్డి జీరో అవర్ నోటీస్ ఇఛ్చారు. ఛైర్మన్ వెంకయ్యనాయుడి కార్యాలయానికి దీన్ని పంపించారు.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ను లాభాల్లోకి తీసుకుని రావడం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా ఉండటానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరుతూ ఆయన జీరో అవర్ నోటీస్ ఇచ్చారు. అయిదు కోట్ల మంది ఏపీ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్నందున.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, ప్రతిపాదనలను పునఃసమీక్షించాలని కోరారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకుని రావడానికి ఇదివరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు.
తాము ఎట్టిపరిస్థితులలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ఎవరి అభిప్రాయాన్నికూడా తీసుకోకుండా ప్రైవేటీకరణపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని, కోట్లాది మంది ప్రజల జీవనంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఓ భాగంగా మారిందని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు గనులు కేటాయించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలకు తొలుత గనులను కేటాయించేలా నిబంధనలను పునఃసమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు.