పవన్ కల్యాణ్ దీ రెండు కళ్ల సిద్ధాంతమేనా? ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరొకలా..!
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తరహాలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారా? ఏపీలో ఒకలా.. తెలంగాణలో ఇంకోలా వ్యవహరిస్తున్నారా? టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మొదలుకుని.. పలు అంశాల్లో పవన్ కల్యాణ్ తెలుగుదేశానికి అనుబంధ పార్టీగా మారిపోయారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రత్యేకించి- ఈ తరహా అభిప్రాయం భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నాయకుల నుంచి వ్యక్తం అవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కారణం వల్లే బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్ నిర్వహించ తల పెట్టిన విశాఖ ర్యాలీకి మద్దతు ఇవ్వట్లేదని చెబుతున్నారు.
టీఎస్ ఆర్టీసీ విలీనంపై..
తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కంటి మీద కునకు లేకుండా చేస్తోన్న అంశం.. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల నిరవధిక సమ్మె. 28 రోజులుగా ఈ సమ్మె కొనసాగుతోంది. ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం మెత్తబడట్లేదు.. మెట్టు దిగనూ లేదు. ప్రత్యామ్నాయ మార్గాలతో ఆర్టీసీ సర్వీసులను ప్రజలకు అరకొరగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఏపీ తరహాలో టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా పలు డిమాండ్లపై ఉద్యోగులు కిందటి నెల వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో దిగారు. రోజులు గడిచే కొద్దీ సమ్మె ఉధృతం అవుతోంది. ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.
పవన్ కల్యాణ్ జోక్యం..
టీఎస్ ఆర్టీసీ సమ్మెలో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడం మరో మలుపు తిరిగినట్టయింది. సమ్మె విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితేతర పార్టీలన్నీ ఒక వైపున ఉన్నాయి. కూటమి కట్టాయి. ప్రభుత్వంపై దాడికి దిగుతున్నాయి. ఇప్పటి దాకా పవన్ కల్యాణ్ ఎక్కడా సమ్మెపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. సమ్మె రోజు రోజుకూ ఉధృతమౌతోన్న నేపథ్యంలో గురువారం తొలిసారిగా దీనిపై స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు 48 గంటల డెడ్ లైన్ ఇస్తున్నానని, అప్పట్లోగా స్పందించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అన్నారు. ప్రతిపక్షాల రాజకీయ పోరాటాలకు ప్రత్యక్షంగా మద్దతు పలుకుతానని హెచ్చరించారు. ప్రభుత్వంలో విలీనం చేయాలనే న్యాయమైన డిమాండ్ ను నెరవేర్చాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.
ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియ కొనసాగుతున్నా..
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా పవన్ కల్యాణ్ తెలంగాణ సర్కార్ కు అల్టిమేటం జారీ చేయడం స్వాగతించదగ్గ పరిణామమే. వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల ఓ రాజకీయ నాయకుడిగా పవన్ కల్యాణ్ స్పందించడం హర్షణీయమే. అదే సమయంలో- ఏపీలో ఆర్టీసీని విలీనం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినా, ఒక్కసారి కూడా దానికి అనుకూలంగా పవన్ కల్యాణ్ ప్రకటన చేయకపోవడాన్ని తప్పు పడుతున్నారు. ఆర్టీసీని విలీనం చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేస్తున్నప్పటికీ.. ఒక్కసారి కూడా అనుకూల ప్రకటన చేయలేదని, తెలంగాణ అదే డిమాండ్ ను నెరవేర్చాలంటూ పవన్ ప్రశ్నించడం ద్వంద్వ నీతికి నిదర్శనమనే విమర్శలు ఉన్నాయి.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేస్తున్నారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఆంజనేయ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికలో యధాతథంగా అమలు చేయబోతున్నారు. జనవరి నాటికి విలనీ ప్రక్రియ పూర్తి కావచ్చని తెలుస్తోంది. విలీన ప్రక్రియయ శర వేగంగా సాగుతున్న ఏపీలో.. ఈ విషయంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు పవన్ కల్యాణ్ పై ఉన్నాయి. చివరికి- తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని సైతం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతించారని, పవన్ కల్యాణ్ మాత్రం నోరు మెదపట్లేదని చెబుతున్నారు.
రెండు కళ్ల సిద్ధాంతం కాదా?
పవన్ కల్యాణ్ ముందు నుంచీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సాక్షాత్తూ బీజేపీ నాయకులే ఆఫ్ ది రికార్డుగా చెబుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఒక్క కారణంతోనే ఆదివారం పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించ తల పెట్టిన ర్యాలీకి వెళ్లట్లేదని తేల్చి చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల తరఫున పవన్ కల్యాణ్ నిర్వహిస్తోన్న ఈ ర్యాలీకి తెలుగుదేశం మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ర్యాాలీకి మద్దతు ఇవ్వాలని ఆయన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు విజ్ఞప్తి చేయగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. టీడీపీకి అనకూలంగా ఉంటున్నారనే ఒకే ఒక్క కారణంతో తాము విశాఖ ర్యాలీకి వెళ్లట్లేదని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి ఉదాహరణగా- ఆర్టీసీ విలీన ప్రక్రియను చూపుతున్నారు.