వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ప్రకటన- విధేయత, బీసీ కార్డుకు ప్రాధాన్యం- జగన్ ఎంపిక వెనుక ?
ఏపీలో వైసీపీ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల జాబితా ఇవాళ విడుదలైంది. ఇవాళ వైసీపీ అధికారికంగా విడుదల చేసిన జాబితాలో నలుగురు అభ్యర్ధుల పేర్లను వెల్లడించింది. ఇందులో ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. మరో మూడు స్ధానాలకు నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలను ఎంపిక చేశారు. వీరి ఎంపికకు దారి తీసిన కారణాలను ఓసారి చూద్దాం..
విజయసాయిరెడ్డి
ఏపీలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డికి జగన్ తండ్రి వైఎస్సార్ హయాం నుంచే వైఎస్ కుటుంబ ఆర్ధిక వ్యవహారాలు చూస్తున్న ఆడిటర్ గా పేరుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉన్న సాయిరెడ్డికి జగన్ విపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ నుంచి రాజ్యసభకు పంపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మరోసారి అవకాశం కల్పిస్తున్నారు. ఢిల్లీలో వైసీపీ వ్యవహారాల్లో కీలకంగాఉన్న సాయిరెడ్డికి మరో అవకాశం దక్కడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
నిరంజన్ రెడ్డి
జగన్ అక్రమాస్తుల కేసులో లాయర్ గా వ్యవహరిస్తున్న ఈ టాలీవుడ్ నిర్మాతకు సీఎం జగన్ తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. టాలీవుడ్ హీరో చిరంజీవిని జగన్ కు దగ్గర చేయడంలోనూ నిరంజన్ రెడ్డి పాత్ర ఉందనే ప్రచారం ఉంది. దీంతో ఆయన్ను ఈసారి రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించారు. దీంతో నిరంజన్ రెడ్డి ఎంపికపై ఎలాంటి చర్చా లేకుండానే ఆయనకు సీటు ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఇకపై జగన్ కేసులతో పాటు ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలను చక్కబెట్టబోతున్నారు.
బీద మస్తాన్ రావు
ఒకప్పుడు తెలుగుదేశంలో ఓ వెలుగు వెలిగిన నెల్లూరు జిల్లా నేత బీద మస్తాన్ రావు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి ఫిరాయించారు. బీసీలకు వైసీపీ ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో మస్తాన్ రావు వైసీపీలోకి రావడం, జగన్ రాజ్యసభకు పంపుతానని హామీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే వెంటనే రాజ్యసభ ఎన్నికలు లేకపోవడంతో ఆయన ఇప్పటివరకూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీద మస్తాన్ రావును వైసీపీ రాజ్యసభకు పంపుతోంది.
ఆర్ కృష్ణయ్యకు అనూహ్యంగా చోటు
బీసీ సంఘాల జాతీయ నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్యకు బీసీ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసిన చరిత్ర ఉంది. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగుతారనే పేరు కూడా ఉంది. గతంలో టీడీపీ తరఫున తెలంగాణ సీఎం అభ్యర్ధిగా కూడా ఎంపికైన ఆర్.కృష్ణయ్య ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కాలం కలిసిరాకపోవడంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉంటూ ఏపీలో వైసీపీకి సహకరించిన కృష్ణయ్యను జగన్ రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. అయితే మరో బీసీ నేత, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిని పంపాలా లేక కృష్ణయ్యను పంపాలా అని చివరి నిమిషం వరకూ మల్లగుల్లాలు పడిన జగన్.. చివరికి కృష్ణయ్యకే అవకాశమిచ్చారు.