వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరో భారీ ట్విస్టు - వాట్ నెక్స్ట్..!!
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి భారీ ట్విస్టు. అమరావతి పరిధిలో ఉన్న తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ అధినాయకత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2019 ఎన్నికల్లో తాడికొండ నుంచి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుంచి గెలిచి తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఎంపీ నందిగం సురేష్ వర్గీయులు..ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం మధ్య అనేక వివాదాలు తెర మీదకు వచ్చాయి. వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సిద్దం అవుతున్న సమయంలో వైసీపీ అధినాయకత్వానికి ఈ నియోజకవర్గం కీలకంగా మారింది. అమరావతి కేంద్రంగా ఉన్న మంగళగిరి - తాడికొండలో గెలుపు వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ సమయంలో తీసుకున్న తాజా నిర్ణయం నియోజకవర్గంలో మరో వివాదంగా మారుతోంది.

తాడికొండలో తాజా నియామకంతో..
తాడికొండ నియోజకవర్గంలో కొద్ది నెలల క్రితం పార్టీ అధినాయకత్వం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ ను సమన్వయ కర్తగా నియమించింది. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటుగా మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు..మంత్రిగానూ పని చేసారు. వైసీపీలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ఆయనకు తాడికొండ బాధ్యతలు అప్పగించటం పైన ఎమ్మెల్యే కు రుచించ లేదు. దీంతో, కొంత కాలం నిరసనల తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలతో భేటీ అయ్యారు. దీంతో, డొక్కాను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. కానీ, ఇప్పుడు తాడికొండకు అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్ కుమార్ వైసీపీ అధిష్టానం నియమించింది.

ఎమ్మెల్యే శ్రీదేవికి మరో షాక్..
ఈ నిర్ణయం తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి వైసీపీ మరో షాక్ గా మారింది. ప్రతీ నియోజకవర్గానికి ఇంఛార్జ్ లను నియమిస్తున్న పార్టీ నాయకత్వం గతంలో డొక్కాకు బాధ్యతలు ఇచ్చింది. అయితే, డొక్కాతో ఉన్న గ్రూపు రాజకీయాలు..విభేదాల కారణంగా ఇప్పుడు కత్తెర సురేష్ కుమార్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ కత్తెర సురేష్ కుటుంబం తాడికొండకు ఇన్చార్జిగా వ్యవహరించింది. సురేష్ భార్య కత్తెర క్రిస్టిన 2014లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్లో సమన్వయంతో పార్టీ గెలుపుకు దోహదం చేసేలా వ్యవహరించాలని పార్టీ నాయకత్వం సురేశ్ కు సూచించింది. కానీ, వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి సీటు ఆశిస్తున్న శ్రీదేవి ఈ నియామకం పైన ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.

తాడికొండ - మంగళగిరిలో గెలుపు ప్రతిష్ఠాత్మకం
వైసీపీకి ఇప్పుడు అమరావతి పరిధిలోని మంగళగిరి - తాడికొండలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. మూడు రాజధానుల నిర్ణయంతో ఇక్కడ టీడీపీ తమకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయనే అంచనాతో ఉంది. మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్ధిగా నారా లోకేష బరిలో నిలుస్తున్నారు. ఆయన పైన అభ్యర్ధి ఎవరనేది వైసీపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సారి గెలుపు దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. అక్కడ వైసీపీ బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్దం అవుతోంది. అదే విధంగా తాడికొండలోనూ గెలుపు కోసం నియోజవర్గంలో వైసీపీ నేతల మధ్య గ్రూపులు - వర్గ పోరుతో తాజాగా సురేశ్ కుమార్ నియామకం చేసినట్లుగా తెలుస్తోంది. అందరినీ సమన్వం చేసుకుంటూ..కలిసి కట్టుగా పని చేయాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. ఇప్పుడు సురేష్ కు ఎమ్మెల్యే వర్గం ఏ రకంగా సహకారం అందిస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications