విజయవాడలో వైసీపీ Vs టీడీపీ, వాళ్లు ఒక్కటయ్యారు- కలిసొచ్చేదెవరికి...!!
ఏపీలో రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ఈ నెల 27 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. వైసీపీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన జగన్ ఓటమి లక్ష్యంగా ఎన్నికల పోరుకు సిద్దమవుతున్నాయి. కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఈ సమయంలోనే విజయవాడ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ పెంచుతోంది.
మారుతున్న లెక్కలు: విజయవాడలోనూ మూడు అసెంబ్లీ నియోకవర్గాల్లో వైసీపీ అభ్యర్దులు ఖరారయ్యారు. విజయవాడ లోక్ సభ అభ్యర్దిగా టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పేరును వైసీపీ ప్రకటించింది. టీడీపీ, జనసేనలో విజయవాడ పశ్చిమ సీటు గురించి పోటీ కొనసాగుతోంది. సెంట్రల్ సీటులో వంగవీటి రాధా - బోండా ఉమ మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది.

ఎంపీగా టీడీపీ నుంచి ఎవరు పేరు ఖరారు చేస్తారనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇటు వైసీపీలో సెంట్రల్ సీటును వెల్లంపల్లి శ్రీనివాస్ కు సీఎం జగన్ కేటాయించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహకరించరించేందుకు ముందుకు రాలేదు. దీంతో, విష్ణు భవిష్యత్ అడుగుల పైన కొత్త ప్రచారాలు తెర మీదకు వచ్చాయి.
ఆ ఇద్దరూ కలిసారు: ఈ రోజు వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విష్ణు మద్దతు దారులుగా ఉన్న కార్పోరేటర్లు వెల్లంపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న విష్ణు చివరకు అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యం అని కేడర్ కు తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. దీంతో, వెల్లంపల్లికి సెంట్రల్ లో రూటు క్లియర్ అయింది. వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేసారు. ఇక, టీడీపీలో సెంట్రల్ సీటు బోండా ఉమాకు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో వంగవీటి రాధా పేరు తెర మీదకు రావటంతో ఇక్కడ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
వ్యూహా ప్రతివ్యూహాలతో: టీడీపీలో విజయవాడ పశ్చిమ సీటు పైనా సందిగ్ధత కొనసాగుతోంది. టీడీపీ సీనియర్లు తమకే సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఇదే సీటు జనసేన కోరినట్లు చెబుతున్నారు. ఇక్కడ నుంచి పోతిన మహేష్ సీటు ఆశిస్తున్నారు. అయితే, టీడీపీ - జనసేన సీట్ల పంపకాల పైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
పవన్ కల్యాణ్ ఇప్పటికే దాదాపు 40 సీట్లకు సంబంధించి సీమక్షలు పూర్తి చేసారు. 40 సీట్ల వరకు పవన్ కోరుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే, పొత్తులో చివరకు చంద్రబాబు ఎన్ని సీట్లకు ఆమోదముద్ర వేస్తారనేది జనసేన ఆసక్తిగా గమనిస్తోంది. టీడీపీ విజయవాడలో తిరిగి పట్టు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా, 2019 తరహాలోనే ఇక్కడ టీడీపీని దెబ్బ తీయాలనేది వైసీపీ వ్యూహం. దీంతో, ఇక్కడ రాజకీయం ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications