ఆ తొమ్మది మందికి సీఎంఓ నుంచి ఫోన్ కాల్ - వైసీపీలో ఏం జరుగుతోంది: ఆ దిశగా అడుగు పడినట్టే
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. జిల్లాల పర్యటనలతో జనం మధ్యే ఉంటోన్నారు. బహిరంగ సభల్లో తన ప్రసంగం శైలినీ మార్చారు. ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలు, అమలులో ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే- ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలను సంధిస్తోన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై చురకలు అంటిస్తోన్నారు. ఆయన ప్రసంగాల తాలూకు విమర్శలు జనంలోకి వెళ్తోన్నాయి.
రాజధానిగా అమరావతిపై ఏపీ కాంగ్రెస్ తాజా నిర్ణయం ఇదే..!!
వర్క్షాప్లతో..
వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- వైఎస్ జగన్ అటు పార్టీపరంగానూ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీపడట్లేదు. ఇందులో భాగంగా తరచూ వర్క్షాప్లను నిర్వహిస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్బ్యాక్ను వైఎస్ జగన్ దీనికి ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు.
4న మరోసారి..
డిసెంబర్ 4వ తేదీన వైఎస్ జగన్ మరోసారి వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు.. ఇందులో పాల్గొననున్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం ఉపయోగపడుతోంది. భవిష్యత్లో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది.
బీసీ నేతలతో..
ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీకి చెందిన సీనియర్ బీసీ నాయకులతో భేటీ కానున్నారు. మొత్తం తొమ్మిది మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతోన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ మేరకు ఆ తొమ్మిది మంది నాయకులకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వెళ్లినట్లు సమాచారం.
ఎవరా తొమ్మిది మంది..
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సందేశాన్ని అందుకున్న వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కొలసు పార్థసారథి, మాజీ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వీరితో పాటు మరి కొందరు నేతలు ఈ భేటీకి హాజరు కావొచ్చని తెలుస్తోంది.
మూడు ప్రాంతాల నుంచీ..
ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాలకు చెందిన బీసీ నాయకులతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల వాతావరణం వేడెక్కిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ జరుగబోతోండటం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశం అజెండా ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదు. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి.