జగన్ ఆపరేషన్ ఢిల్లీ వయా బెంగళూరు..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి బెంగళూరు వెళ్తున్నారు. ఈ రోజు నుంచి జగన్ ప్రజాదర్బార్ ప్రారంభిస్తారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, జగన్ తాజాగా బెంగళూరు పర్యటన ఖరారైంది. వచ్చే వారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఖరారు కానున్నాయి. ఈ సమయంలో వరుసగా జగన్ బెంగళూరు కేంద్రంగా చేస్తున్న ఆపరేషన్ పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ వేస్తున్న అడుగుల పైన కొత్త చర్చ మొదలైంది.
బెంగళూరుకు జగన్
మాజీ సీఎం జగన్ మరోసారి బెంగళూరు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. కడప జిల్లాలో రెండు సార్లు పర్యటించారు. ఈ రోజు నుంచి పార్టీ నేతలకు..ప్రజలకు అందుబాటులో ఉండేలా తాడేపల్లి నివాసంలోనే ప్రజాదర్బార్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కానీ, చివరి నిమిషంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది.

చికిత్స కోసమేనా
గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్.. ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళుతున్నారు. ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు జగన్ బెంగళూరు తమ కాలికి వైద్యం కోసమే వెళ్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్ కాలుకు గాయమైంది. ఇప్పుడు ఈ సమస్య బాధిస్తుండటంతో చికిత్స కోసం వెళ్తుననారని వెల్లడించారు.
రాజకీయ అడుగులు
జగన్ బెంగళూరు కేంద్రంగా ఢిల్లీ రాజకీయం నడుపుతున్నారనే చర్చ వినిపిస్తోంది. కేంద్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణాల వేళ జగన్ మంత్రాంగం కొనసాగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, పార్టీ ముఖ్య నేతలు మాత్రం జగన్ అసెంబ్లీకి హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు, పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. ఈ వారం మొత్తం జగన్ బెంగళూరులోనే ఉంటారని సమాచారం. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తరువాత ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు జగన్ నిర్ణయాల పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications