2027లో జగన్ పాదయాత్రకు తేదీ ఖరార్- వ్యూహాత్మకంగా రోడ్ మ్యాప్? ఈ సారి కొడితే
ఏపీ రాజకీయాల్లో మరోమారు పాదయాత్ర సందడి మొదలుకానుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ముందుగా ప్రకటించినట్టే ఈ పాదయాత్రకు 2027లో ముహూర్తం పెట్టారు. తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆకాంక్షలను ఆలకించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.. జగన్.
నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారాయన. ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి ఈ పాదయాత్రను ఒక వ్యూహాత్మక అస్త్రంగా మలచుకోవాలని వైఎస్ జగన్ ఈ పాదయాత్ర ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ప్రస్తుతం చర్చల దశలో ఉందని, పాదయాత్ర ప్రారంభం కావడానికి కనీసం ఆరు నెలల ముందు ఖరారు చేస్తారని అంటున్నారు.

2027 జూలై 8వ తేదీన జగన్ తన పాదయాత్ర ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ తేదీని ఎంచుకోవడం వెనుక బలమైన రాజకీయ సెంటిమెంట్ ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు కావడం, గతంలో వైఎస్ఆర్ చేపట్టిన ఐకానిక్ ప్రజాప్రస్థానం పాదయాత్ర, ఆ తర్వాత జగన్ స్వయంగా నవంబర్ 2017లో ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర రెండూ కూడా వారిని అధికార పీఠం వైపు నడిపించాయి. దీంతో అదే నమ్మకంతో 2027 జూలై 8న ఈ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఊహించని విధంగా పరాజయాన్ని చవిచూసింది. 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయాయి. ఈ తర్వాత ఏడాదిలోపే జగన్ మళ్లీ జనంలోకి రావడం మొదలుపెట్టారు. రైతులు, యువత, మహిళలు.. ప్రత్యేకించి శాంతి భద్రతలు వంటి వివిధ వర్గాలవారు, అంశాలపై జిల్లాల్లో పర్యటించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉందంటూ ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో ఇక 2029 సాధారణ ఎన్నికలకు దాదాపు రెండు సంవత్సరాల ముందే ఈ సుదీర్ఘ యాత్రను ప్రారంభించడం ద్వారా నిరంతరం ప్రజల్లో ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారు. పాదయాత్ర రోడ్ మ్యాప్ రూపకల్పనపై వైసీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే క్షేత్రస్థాయి విశ్లేషణను ప్రారంభించింది. అన్ని జిల్లాల్లోని ప్రధాన నియోజకవర్గాలను కలుపుతూ సాగేలా ఈ ప్రణాళికను రూపొందిస్తోన్నారు. గత ఎన్నికల్లో పార్టీ దెబ్బతిన్న నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
YSRCP chief and former Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy is scheduled to launch a statewide padyatra on July 8, 2027: Party Sources pic.twitter.com/Ln6M4bau3h
— IANS (@ians_india) September 3, 2026
వివిధ రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీకి ఈ పాదయాత్ర ఎంతవరకు ఊతమిస్తుందనేది చర్చనీయాంశమౌతోంది. గతంలో ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసి జనాదరణను సొంతం చేసుకున్న అనుభవం జగన్కు ఉంది. అదే ఆయనను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేలా చేసింది. 2019 నాటి ఎన్నికల్లో 151 స్థానాలతో అధికారాన్ని అందుకుంది వైఎస్ఆర్సీపీ. 2024 ఎన్నికల నాటికి తన ప్రాభవాన్ని కోల్పోయింది. పూర్వవైభవాన్ని సాధించాలనే పట్టుదలతో ఉన్నారు జగన్.













Click it and Unblock the Notifications