జగన్కు మరో షాక్: ఈడీ వలలో వైసీపీ ఎంపీ అభ్యర్థి సామాన్య భర్త కిరణ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో షాకిచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సామాన్య కిరణ్..
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో షాకిచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సామాన్య కిరణ్.. చిత్తూరు పార్లమెంటు లోక్సభ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా, ఆమె భర్త కిరణ్ 2005 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. సామాన్య ఎన్నికల్లో పోటీ చేసే సమయానికే ఆమె భర్త పశ్చిమబెంగాల్లోని సిలిగురి-జల్పాయిగురి అభివృద్ధి సంస్థ అధికారిగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి ఆరోపణలతో అరెస్టయ్యారు.
ఏపీలో పుట్టి, తెలంగాణకు కోడలుగా వెళ్లిన సామాన్య.. అనూహ్యంగా చిత్తూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. భర్త అవినీతి ఆరోపణలు, ఆమె స్థానికతను ప్రచారాస్త్రంగా చేసుకున్న టీడీపీ ఆ ఎన్నికల్లో సునాయసంగా విజయం సాధించింది. తాజాగా రెండు రోజుల క్రితం సామాన్య భర్త కిరణ్ ఇంటిపై ఈడీ దాడి చేయడంతో సామాన్య పేరు మరోసారి తెరపైకి వచ్చినట్లయింది.
వివరాల్లోకి వెళితే... సామాన్య పుట్టినిల్లు నెల్లూరు. అదే జిల్లాలోని ఎస్పిజిఎస్టి డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పని చేసేవారు. రచయితగానూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. వివిధ సామాజిక అంశాలపై పుస్తకాలు రచించారు. కాగా, ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన ఐఏఎస్ అధికారి కిరణ్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా కొన్నాళ్లు బాధ్యతలు చేపట్టారు. అక్కడ నుంచే వైసీపీ తరఫున పోటీ చేయాలనుకున్నారు. కానీ, అనూహ్యంగా చిత్తూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శివప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు.
కాగా, ఐఏఎస్ అధికారి కిరణ్.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి సన్నిహతుడు కావడం గమనార్హం. కిరణ్ నివాసంలో సోదాలు చేసిన ఈడీ.. ఆయన భార్య సామాన్యకు సంబంధించిన ఆస్తులపైనా దృష్టి సారించింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా ఉన్న ఆమె 2014 ఎన్నికల్లో ఏమాత్రం సంబంధం లేని చిత్తూరు ఎంపీ స్థానానికి నుంచి పోటీ చేయడం, అప్పట్లో ప్రచారానికి చేసిన ఖర్చులపై ఆరా తీస్తోంది. ఆమె భర్త ద్వారా జల్పాయిగురి కాంట్రాక్టర్ల నుంచి రూ.6 కోట్ల నిధులు పార్టీకి అందినట్లు ఆరోపణలున్నాయి. దీంతో సామాన్య కిరణ్పైనా ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం.
ఇది ఇలావుంటే.. పశ్చిమబెంగాల్ క్యాడర్, 2005 ఐఎఎస్ బ్యాచ్కు చెందిన సామాన్య భర్త కిరణ్.. 2011 ఆగస్టు నుంచి 2013 మార్చి వరకూ సిలిగురి- జల్పాయిగురి అభివృద్ధి సంస్థ సీఈవోగా పనిచేశారు. అయితే, ఆయన రూ.200 కోట్ల నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనపై 8 కేసులు నమోదు కాగా, 2013 నవంబరులో అరెస్టయ్యారు.
అనంతరం బెయిలుపై విడుదలై ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ప్లానింగ్, స్టాటిస్టిక్స్, మానిటరింగ్ విభాగం జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా కోల్కతాలోని ఆయన నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) సోదాలు చేసి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకుంది.