సన్ రైజర్స్ కు గట్టి టీమే పడింది బాస్: ప్లేఆఫ్స్ డీటెయిల్స్
ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. రాజస్థాన్ రాయల్స్ ఆఖరి ప్లేఆఫ్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో ఈ సీజన్ నాకౌట్ దశకు రంగం సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 30 పరుగుల తేడాతో విజయం సాధించి, చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. దీంతో లీగ్ దశకు తెర పడింది. ఇక ప్లేఆఫ్స్ మొదలు కానున్నాయి. తొలి మ్యాచ్ మంగళవారం జరుగనుంది.
నాలుగో ప్లేఆఫ్ బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాజస్థాన్, కోల్కతా ఓడిపోయి ఉంటే, పంజాబ్ కింగ్స్కు ప్లేఆఫ్ అవకాశం దక్కేది. రాజస్థాన్ అద్భుత ప్రదర్శనతో తన స్థానాన్ని ఖరారు చేయడమే కాకుండా, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ను రేసు నుండి నిష్క్రమించేలా చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ప్లేఆఫ్ దశకు అర్హత సాధించిన నాలుగో జట్టుగా నిలిచింది.

ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్కు చేరుకున్న విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్ మంగళవారం ధర్మశాలలో క్వాలిఫైయర్ 1తో ఆరంభం కానున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం లభిస్తుంది.
ఎలిమినేటర్ మ్యాచ్ 27న ముల్లన్పూర్లో జరుగుతుంది. ఈ పోటీలో పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుంది. విజేత.. క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టుతో తదుపరి పోరులో తలపడుతుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ మే 29న ముల్లన్పూర్లోనే జరుగుతుంది. ఇందులో ఎలిమినేటర్ విజేత, క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టుతో పోటీపడుతుంది.
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్లో జరిగుతుంది. ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల విజయం సాధించి ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. జోఫ్రా ఆర్చర్ ఆల్రౌండర్గా మెరిశాడు. బ్యాటింగ్లో 15 బంతుల్లో 32 పరుగులు చేసి, బౌలింగ్లో 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో 73 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో స్కోరును భారీగా పెంచారు. రవీంద్ర జడేజా 19 పరుగులతో నాటవుట్గా నిలిచాడు. రోహిత్ శర్మను అవుట్ చేసిన ఆర్చర్, ముంబై ఛేజింగ్ను దెబ్బతీసి రాజస్థాన్ విజయాన్ని సులభతరం చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ 60 పరుగులు, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ నుండి స్వల్ప ప్రతిఘటన ఉన్నప్పటికీ, ముంబై ఇండియన్స్ 9 వికెట్లకు 175 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఆర్చర్ ఆరంభంలో పడగొట్టిన కీలక వికెట్లతో ముంబై ఇండియన్స్ విజయావకాశాలు సన్నగిల్లాయి. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించగా, పంజాబ్ కింగ్స్, కోల్ కత నైట్ రైడర్స్ టోర్నీ నుండి నిష్క్రమించాయి.












Click it and Unblock the Notifications