మున్సిపోల్స్లో వైసీపీ క్లీన్స్వీప్-తాడిపత్రికే టీడీపీ పరిమితం- తుది ఫలితాలివే
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్స్వీప్ ఖాయమైపోయింది. కేవలం అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రమే టీడీపీకి ఊరట లభించింది. మిగతా 74 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 11 కార్పోరేషన్లలో వైసీపీ సునామీ కొనసాగింది. విజయవాడ, విశాఖ, మచిలీపట్నం కార్పోరేషన్లలో తుది ఫలితాలు వెలువడాల్సి ఉన్నా ప్రస్తుత ఆధిక్యాలను చూసుకుంటే వైసీపీ మ్యాజిక్ మార్క్ దాటిపోయింది. దీంతో మున్సిపల్ ఎన్నికల పోరును వైసీపీ ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో ముగించినట్లయింది. చివరికి టీడీపీ ఆశలు పెట్టుకున్న అమరావతి ప్రాంతంలోనూ విజయవాడ, గుంటూరు కార్పోరేషన్లలోనూ ఓటమి తప్పలేదు.
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సునామీ
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సునామీయే సృష్టించింది. 20 నెలల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని జనం, రాజకీయ పార్టీలు మర్చిపోక ముందే అంతకంటే ఘన విజయాన్ని మున్సిపల్ ఎన్నికల్లో అందుకుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించి అనంతపురం జిల్లా వరకూ వైసీపీ ప్రభంజనం కొనసాగింది. ఫ్యాన్ గాలికి టీడీపీ, జనసేనతో పాటు ఇతర విపక్షాలు కకావికలై పోయాయి. దాదాపు ప్రతీ చోటా వైసీపీ మెజార్టీ స్ధానాలు కైవసం చేసుకుంది. ఎక్కడ చూసినా వైసీపీతో పోలిస్తే రెండో స్ధానంలో నిలిచిన టీడీపీ చాలా దూరంలోనే నిలిచిపోయింది. ఓట్ల పరంగా, సీట్ల పరంగా వైసీపీ సాధించిన మున్సిపల్ విజయం సార్వత్రిక ఎన్నికలను సైతం మించిపోయింది.
మున్సిపల్ పోరులో తుది ఫలితాలివే
ఏపీలో 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏలూరు కార్పోరేషన్కు ఎన్నికలు జరిగినా హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ చేపట్టలేదు. నాలుగు మున్సిపాలిటీలు పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్లలో ఏకగ్రీవాలు కావడంతో మిగిలిన 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో వైసీపీ భారీ విజయాల్ని నమోదు చేసింది. అన్ని కార్పోరేషన్లను గెల్చుకోవడమే కాకుండా తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్ని సైతం కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్ర చరిత్రలోనే ఈ ఎన్నికలు ఓ రికార్డుగా నిలవబోతున్నాయి.
తాడిపత్రి, మైదుకూరులో టీడీపీ గెలుపు నిలిచేనా?
మున్సిపల్ పోరులో రాష్ట్రమంతా ఎదురుగాలి వీచినా కేవలం అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే టీడీపీ అధికారికంగా గెల్చుకున్నట్లయింది. కడప జిల్లా మైదుకూరులో టీడీపీ, వైసీపీ మధ్య ఒకే ఒక్క సీటు తేడా. ఇక్కడ ఒక్క సీటు ఆధిక్యం అందుకున్న టీడీపీకి ఎక్స్అఫీషియో ఓట్ల రూపంలో వైసీపీ నుంచి గండం పొంచి ఉంది. అయితే వాటితో కూడా అవసరం లేకుండా క్యాంప్ రాజకీయాలకు పార్టీలు తెరలేపాయి. ఇక మిగిలిన తాడిపత్రిలోనూ టీడీపీ కార్పోరేటర్లపై వైసీపీ వల విసురుతోంది. ఛైర్మన్ ఎన్నికలు జరిగే లోపు ఇక్కడ టీడీపీ కార్పోరేటర్లు వైసీపీ వైపు మొగ్గితే ఇక మున్సిపల్ పోరులో టీడీపీకి మిగిలేది సున్నాయే.
మున్సిపోల్స్లో ప్రభావం చూపిన జనసేన
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గాలికి విపక్షాలన్నీ దాదాపుగా కొట్టుకుపోయాయి. అయితే ప్రధాన విపక్షం టీడీపీతో పోలిస్తే జనసేన మెరుగైన ప్రదర్శన చూపింది. పలుచోట్ల వైసీపీ, టీడీపీలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ఓట్లు కూడా చీల్చుకుంది. మరికొన్ని చోట్ల టీడీపీకి మద్దతిచ్చింది. ఇంకొన్ని చోట్ల టీడీపీ మద్దతు తీసుకుని గెల్చుకుంది. అమలాపురం మున్సిపాల్టీలో అయితే ఏకంగా టీడీపీని మూడో స్ధానానికి నెట్టి రెండోస్ధానంలో నిలిచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాపాక కూడా దూరమైన క్రమంలో జనసేన సాధించిన విజయాలు కచ్చితంగా ఆ పార్టీలో ఆత్మస్ధైర్యం నింపనున్నాయి.