కేంద్రానికి కీలక సమయంలో అండగా జగన్ - పొత్తు రాజకీయాల్లో కీలక మలుపు..!!
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఏపీలో సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా బీజేపీ, జనసేన, టీడీపీ పని చేస్తున్నాయి. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది.ఈ రాజకీయంలో బీజేపీ- టీడీపీ మధ్య సంబంధాలే పజిల్ గా మారాయి. ఈ సమయంలో కేంద్రానికి కీలక సమయంలో జగన్ అండగా నిలుస్తున్నారు. దీంతో, పొత్తు రాజకీయంలో భారీ ట్విస్ట్ కనిపిస్తోంది.
ఏపీలో పొత్తు రాజకీయం: ఏపీలో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన అవగాహనతో పని చేస్తున్నాయి. ఎన్డీఏ సమావేశానికి పవన్ హాజరయ్యారు. టీడీపీకి పిలుపు లేదు. కానీ, ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఏపీ బీజేపీ నూతన చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన పురేందశ్వరి తొలి రోజు నుంచి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

ఇటు రాష్ట్రంలో ఈ మూడు పార్టీల ఉమ్మడి లక్ష్యంగా జగన్ మారారు. కానీ, కేంద్రంలో మాత్రం బీజేపీ అధినాయకత్వానికి జగన్ మద్దతు అవసరం అయింది. పార్లమెంట్ లో వచ్చే వారం కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానంతో పాటుగా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సభ ముందుకు రానున్నాయి.
కేంద్రానికి మద్దతుగా వైసీపీ: అవిశ్వాస తీర్మానం విషయంలో లోక్ సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. కానీ, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు విషయంలో మాత్రం రాజ్యసభలో వైసీపీ మద్దతిస్తేనే బిల్లు గట్టెక్కే అవకాశం ఉంది. ఈ సమయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని తిప్పికొట్టాలని తాజాగా ఒక జాతీయ మీడియా చర్చలో వ్యాఖ్యానించారు.
ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదని అన్నారు. కేంద్రం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ సమాఖ్య స్పూర్తిని దెబ్బ తీయడం లేదని పేర్కొన్నారు. అందుకే ఈ రెండు విషయాల పట్ల వైఎస్సార్సీపీ కేంద్రానికి మద్ధతిస్తుందని వెల్లడించారు. మణిపుర్ అంశంపై విపక్షాలు కేంద్రానికి మద్ధతుగా కలిసిరావాలని కోరారు. కేంద్రానికి వైసీపీ మద్దతు ఇవ్వనుందని దీంతో స్పష్టత వచ్చింది.

వైసీపీ వ్యూహం ఫలిస్తుందా: కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో వ్యతిరేకిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మాత్రం అవిశ్వాసంపై జగన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజ్యసభలో టీడీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. అవిశ్వాసం, ఢిల్లీ ఆర్దినెన్స్ బిల్లు విషయంలో టీడీపీ తమ వైఖరి అధికారికంగా వెల్లడించ లేదు.
బీజేపీ కోరితే మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో పొత్తు రాజకీయం వేళ కేంద్రానికి అవసరమైన వేళ మద్దతుగా వైసీపీ నిలుస్తోంది. దీని ద్వారా ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ పొత్తు పైన ప్రభావం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పొత్తుల రాజకీయ ఎత్తుల్లో ఎవరి వ్యూహం ఫలిస్తుంది..ఎటువంటి మలుపులకు కారణం అవుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications