Annadata Sukhibhava: కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ-తాజా డిమాండ్..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకం (Annadata Sukhibhava) కింద రైతుల ఖాతాలో నిధుల్ని జమ చేసేందుకు రంగం సిద్దమవుతోంది. అయితే భూములు ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటివరకూ వర్తింపచేస్తున్న ఈ పథకాన్ని కౌలు రైతులకూ వర్తింపజేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. విపక్ష వైఎస్సార్సీపీ ఈ మేరకు తాజాగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
వైయస్సార్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చి వదిలేశారని,మొదటి ఏడాది ఒక్క రూపాయి పెట్టుబడి సాయం ఇవ్వకుండా మోసం చేశారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. రెండో ఏడాది 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారన్నారు. కౌలు రైతులకు పథకం అందడం లేదన్నారు. వైయస్సార్సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందితే నేడు 46.86 లక్షల మందికే అన్నదాత సుఖీభవ అందిస్తామని చెబుతున్నారని ఆక్షేపించారు. మోంథా తుపాన్ నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని, సున్నా వడ్డీ రుణాల ఊసేలేదని ఆరోపించారు.

ఇప్పటికైనా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఏడాది ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లబొల్లి మాటలతో రైతులను వేధించడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేసే విధానాన్ని సరళతరం చేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్నఏ ఒక్క రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదని, ఈ క్రాపింగ్ చేయడం లేదని, ఉచిత పంటల బీమా ఊసే లేదని ఆయన విమర్శించారు. కనీసం కట్ట యూరియా బస్తా కూడా దొరకని దుస్థితి ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చేసి నిర్వీర్యం చేశారన్నారు. 2 లక్షల టన్నుల మామిడి వృథాగా పోతే ప్రభుత్వం నిద్రపోతుందా? యాప్లో బుక్ చేస్తేనే రైతులకు ఎరువులు ఇస్తామని చెబుతున్నారు, కానీ కౌలు రైతులకు ఎలా తీసుకోవాలో చెప్పడం లేదన్నారు.














Click it and Unblock the Notifications