చంద్రబాబు ఆదేశించిన చోటే- ముందస్తుకు ముహుర్తం ఇదే..ఆనం కీలక వ్యాఖ్యలు..
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ పైనే తిరుగుబాటు చేసి చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో సస్పెండ్ అయిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భవిష్యత్ ప్రణాళికలపై దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో తన పోటీ, ముందస్తు ఎన్నికలు వంటి అంశాలపై ఆనం రామనారాయణరెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండ్ కావడంతో స్వతంత్రుడిగా మారిన ఆనం రామనారాయణరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనంకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పట్టుంది. వీటిలో ఏదో ఒక స్ధానం నుంచి పోటీ చేసేందుకు ఆనం రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని ఆనం హింట్ ఇచ్చేశారు. అయితే తాను ఎంపీగా పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల ప్రచారంపైనా ఆనం స్పందించారు. ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆనం తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ జిల్లాలో అన్ని స్ధానాలు గెలుస్తుందని జోస్యం చెప్పారు. అలాగే ఎన్నికలకు ముందు టీడీపీలోకి 60 శాతం మంది వైసీపీ నుంచి చేరతారని ఆనం వెల్లడించారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పనుల కోసం చాలా మంది ఆ పార్టీలోనే కొనసాగుతున్నారని తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత తన సీటు వెంకటగిరితో పాటు ఆత్మకూరు, నెల్లూరు సిటీల్లో ఏదో ఒక స్ధానం నుంచి ఆనం బరిలోకి దిగుతారన్న అంచనాలున్నాయి. వీటిలో ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి, నెల్లూరు సిటీలో ఆనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం సిట్టింగులుగా ఉన్నారు. ఈ రెండు సీట్లలో ఒకదాన్ని తనకు కేటాయించమని ఆనం చంద్రబాబును కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరులో గతంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి నారాయణతో మళ్లీ పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. కాబట్టి ఆత్మకూరులో అవకాశం ఉండొచ్చంటున్నారు.












Click it and Unblock the Notifications