మైండ్ గేమ్లో ఎవరిది పైచేయి?: లోకేశ్పై విమర్శలు, బాబు అవేదన
అమరావతి: చాలా రోజుల తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొన్నటి వరకు రాజధాని భూములు, ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు లాంటి అంశాలపై అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ గత కొన్ని రోజులుగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది.
అయితే అనూహ్యంగా టీడీపీ నుంచి అంతకు మించి ఎదురుదాడి మొదలు కావడంతో మైండ్ గేమ్ ఆసక్తికరంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్పను నారా లోకేశ్ పార్టీ శిక్షణ తరగతుల్లో భాగంగా నిలబెట్టి అవమానించారంటూ ఫొటో ఆధారంగా వైసీపీ నేతలు వరస విమర్శలు చేయటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
అయితే, అసలు ఆరోజు సమావేశంలో ఏ జరిగిందో ప్రజలకు తెలియాలని లోకేశ్ వీడియో విడుదల చేయటంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. అంతేకాదు వైసీపీ అనవసరంగా లోకేశ్పై వ్యక్తిగత విమర్శలు చేస్తోందనే భావన ప్రజలలో పెరగింది. అంతేకాదు వ్యూహాత్మంకగా దెబ్బతిన్నామని అటు వైసీపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది.
ఫేస్బుక్, వాట్సాప్లలో ఎక్కువ సంఖ్యలో లైకులు
సోషల్ మీడియా దృష్టిలో పెట్టుకుని వైసీపీ చేసిన ఫోటో రాజకీయంపై అదే విధంగా టీడీపీ విడుదల చేసిన వీడియోకు కూడా ఫేస్బుక్, వాట్సాప్లలో ఎక్కువ సంఖ్యలో లైకులు రావడమే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది. ఆ వీడియోని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు మూకుమ్మడి దాడి చేశారు. ఇంతలో లోకేశ్కు సంబంధించిన పాత ఫోటోలను ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విడుదల చేశారు. తద్వార వీడియో వైఫల్యం నుంచి దృష్టి మళ్లించే ఎత్తుగడ వేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఇందులో భాగంగానే దసరా రోజున సాక్షి పత్రికలో లోకేశ్కు సంబంధించిన ఫొటోలు విడుదల చేశారు.
వైసీపీ డిమాండ్
అంతేకాదు వాటికి సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. గతంలో అదే ఫోటోలను వైసీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ అవే ఫోటోలు మీడియాకు విడుదల చేయడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. కాగా, త్వరలో ఏపీ మంత్రి వర్గ విస్తరణ అవుతుందని, లోకేష్కు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలను లోకేశ్ నేతృత్వంలోనే పార్టీ మారేలా చేస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్న వైసీపీ నేరుగా లోకేశ్పై ఈ మైండ్గేమ్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
రాజకీయంగా దెబ్బతీసే వ్యూహాం
ఇలా చేయడం ద్వారా లోకేశ్ను మానసికంగా, నైతికం, రాజకీయంగా దెబ్బతీసే వ్యూహానికి వైసీపీ తెరలేపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే లోకేశ్ పాత ఫోటోలు విడుదలపై టీడీపీ నేతలు అదే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా జగన్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తన చిన్నాన్న వివేకానందరెడ్డిని కడప ఎంపికి రాజీనామా చేయాలని బెదిరించడం, లోటస్పాండ్, బెంగళూరులో 30 ఎకరాల ఇల్లు, 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారంటూ దుయ్యబట్టారు.
పార్టీ నేతల వద్ద చంద్రబాబు మనస్తాపం
అంతేకాదు 16 నెలలు జైల్లో ఉన్న వైనాన్ని, వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు... జగన్కు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న ప్రశ్నను మళ్లీ తెరపైకి తెచ్చి ఏపీ రాజకీయాల్లో మరింత వెడేక్కించారు. దానితోపాటు గతంలో అంబటి రాంబాబు ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో రికార్డును కూడా టీడీపీ ఇప్పుడు తెరపైకి తెచ్చింది. ఆ ఆడియో రికార్డు ఇప్పుడు వాట్సాప్, పేస్బుక్, ట్విట్టర్, మెయిళ్లలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే దసరా పర్వదినాన తనయుడిపై వైసీపీ చేసిన వ్యక్తిగత ఆరోపణలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతల వద్ద మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.