ఆపరేషన్ కుప్పం, ఇదే సరైన సమయం - చంద్రబాబు మూలాలే టార్గెట్..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ కంచుకోటల పై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. వైసీపీని ఓడించటమే లక్ష్యంగా ఒక్కటయ్యాయి. సింగిల్ గానే పోటీకి వైసీపీ సిద్దమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించింది. మంత్రి పెద్దిరెడ్డి ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో, తాజాగా వైసీపీ అక్కడ వేగంగా నిర్ణయాలు అమలు చేస్తోంది.
కుప్పం చంద్రబాబు కంచుకోట. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు ఒక్కరే టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మున్సిపల్..స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీ కుప్పంలో దెబ్బ తింది. వైసీపీ అక్కడ చంద్రబాబును ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పని చేస్తోంది.

ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదం కుప్పం నుంచే మొదలైంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేసారని వైసీపీ ప్రశ్నిస్తోంది. తాజాగా కొత్త జిల్లాలు..రెవిన్యూ డివిజన్ల ఏర్పాటులో భాగంగా కుప్పం ను రెవిన్యూ డివిజన్ గా చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. తాము కుప్పంను రెవిన్యూ డివిజన్ గా చేసామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
ఇక, కుప్పంలో స్థానిక, మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు అలర్ట్ అయ్యారు. పూర్తిగా తన అనుచరులు..స్థానిక నేతలకే కుప్పం బాధ్యతలను వదిలేసిన చంద్రబాబు..ఆ ఫలితాల తరువాత తానే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రతీ మూడు నెలలకు ఒక సారి కుప్పం పర్యటన చేస్తున్నారు. మూడు రోజులు నియోజకవర్గంలో మకాం వేస్తున్నారు.

సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు వైసీపీ అక్కడ ఎమ్మెల్సీ భరత్ ను అభ్యర్దిగా ఖరారు చేసారు. తాజాగా, తమ ఓటింగ్ పెంచుకొనేలా టీడీపీ శ్రేణులను పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా 14 వేల మందికి కొత్తగా ఇంటి పట్టాలు అందించారు. 35 వేల మందికి సామాజిక పెన్షన్లను అందిస్తున్నారు. దీంతో పాటుగా అమ్మఒడి, నవరత్నాల లబ్దిదారులు 53 వేల మందికి చేరారు.

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా కుప్పం పైన ఫోకస్ చేసారు. నిరంతర పర్యటనలు..సమీక్షలు చేస్తున్నారు. స్థానికంగా సొంత నిధులను వెచ్చింది కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అటు చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సమయంలో పట్టు పెంచుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేసారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి గెలవటంతో పాటుగా సీఎంగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసారు.
దీంతో, చంద్రబాబు..లోకేశ్ పోటీ చేసే స్థానాలపైన వైసీపీ ఆపరేషన్ ప్రారంభించింది. చంద్రబాబు కేసులు..పొత్తులు..ఎన్నికల వ్యవహారాల్లో కుప్పం వైపు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం కనిపించటం లేదు. దీంతో, అసలు చంద్రబాబుకు ఇప్పటి వరకు అక్కడ మద్దతుగా నిలుస్తున్న మూలాలే టార్గెట్ గా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications