జిన్నా టవర్ పై వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం-బీజేపీ కూల్చివేత హెచ్చరికలతో
ఏపీలో బీజేపీ గేరు మారుస్తోంది. గుంటూరులో స్వాతంత్రానికి పూర్వం నిర్మించిన చారిత్రక జిన్నా టవర్ పేరు మార్చాలంటుూ పట్టుబడుతోంది. లేకుంటే దాన్ని కూల్చివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎక్కడికి వెళ్లినా దీని గురించే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవాళ గుంటూరు జిన్నా టవర్ ను నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు సందర్శించారు. బీజేపీ నేతల హెచ్చరికల నేపథ్యంలో జిన్నా టవర్ పై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిన్నా టవర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాల్ని సైతం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. రెండు, ముూడు రోజుల్లో జిన్నా టవర్ కు కంచె ఏర్పాటు చేస్తామని మేయర్ మనోహర్ నాయుడు ప్రకటించారు. దీంతో టవర్ భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ నేతల హెచ్చరికలను వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా తప్పుబట్టారు. ఇప్పుడు జిన్నా టవర్ కు కంచె ఏర్పాటు నిర్ణయంతో వారు తమ ఉద్దేశం స్పష్టం చేసినట్లయింది.
బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో వైసీపీకి చెందిన మేయర్ మనోహర్ నాయుడు జిన్నా టవర్ ను పరిశీలించి కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్నాళ్లూ గుంటూరులో కేవలం ఓ సెంటర్ గా చెప్పుకునేందుకు ఉపయోగపడిన జిన్నా టవర్ ఇప్పుడు బీజేపీ నేతల హెచ్చరికలతో సున్నితమైన ప్రాంతంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు జిన్నాటవర్ కు ఏదైనా అనుకోని ఘటన జరిగితే అది మతపరమైన సమస్యగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్న వైసీపీ సర్కార్ దానికి కంచె ఏర్పాటు చేసి భద్రత పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.