ఎన్నికల వేళ ఢిల్లీలో వైసీపీ అరుదైన ఫీట్ - టీడీపీకి షాక్..!!
ఏపీలో ఎన్నికల సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. అధికారం నిలబెట్టుకోవటం కోసం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఎలాగైనా జగన్ ను ఓడించాలనేది కూటమిలోని మూడు పార్టీల లక్ష్యం. అటు కాంగ్రెస్ వామపక్షలతో కలిసి మరో కూటమిగా పోటీ చేస్తోంది. ఈ సమయంలో రాజకీయంగా అందివచ్చిన ప్రతీ అవకాశం పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఇక, ఢిల్లీ కేంద్రంగా ఎన్నికల వేళ వైసీపీ అరుదైన గుర్తింపు దక్కించుకుంది.
వైసీపీ ఖాతాలో 11 స్థానాలు
రాజ్యసభలో ఏపీకి 11 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మొత్తం స్థానాలు వైసీపీ ఖాతాలో చేరాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత తొలి సారి రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయింది. ఎన్నికల వేళ ఈ రికార్డు వైసీపీ సొంతం చేసుకుంది. టీడీపీలో ప్రస్తుతం ఏకైక సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్రబాబు పదవీ కాలం ముగిసింది. ఇదే సమయంలో వైసీపీ నుంచి కొత్తగా ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధ రెడ్డి, గొల్లా బాబూరావు లతో రాజ్యసభ ఛైర్మన్ థన్కడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఆయన ఇప్పటికే తన సభ్యత్వానికి రాజీనామా చేసారు. టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీగా ఎన్నికల బరిలో నిలిచారు.

రాజ్యసభలో నాలుగో పెద్ద పార్టీగా
ఇదే సమయంలో వైసీపీ మరో అరుదైన ఘనత సాధించింది. రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా నిలిచింది. రాజ్యసభలో ప్రస్తుత సంఖ్యా బలం ఆధారంగా బీజేపీ 97, కాంగ్రెస్ -29, టీఎంసీ -13 స్థానాలతో తొలి మూడు పార్టీలుగా నిలిచాయి. ఆ తరువాతి స్థానంలో 11 స్థానాలతో ఇప్పుడు వైసీపీ నాలుగో స్థానంలో చేరింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ జగన్ తన పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసారు. తమకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వటం పైన సీఎం జగన్ కు కొత్త సభ్యులు ధన్యవాదాలు చెప్పారు. దళితులకు సీఎం జగన్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన గొల్ల బాబూరావు చెప్పుకొచ్చారు.
ప్రాతినిధ్యం కోల్పోయిన టీడీపీ
ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ నేతగా ఉన్న విజయ సాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీల సంఖ్యా బలం ఆధారంగా తిరిగి రాజ్యసభలో ఖాళీల వేళ సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. సాయిరెడ్డి ఎంపీగా గెలుపొందితే రాజ్యసభకు రాజీనామా చేయనున్నారు. అదే విధంగా.. 2026లోనే తిరిగి ఏపీ నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత చోటు చేసుకొనే రాజకీయ సమీకరణాల ఆధారంగా రాజ్యసభలో ప్రాతినిధ్యం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో..ఎన్నికల సమయంలో వైసీపీ సాధించిన ఈ అరుదైన ఫీట్ జాతీయ స్థాయిలో రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications