కీలక వ్యాఖ్యలు చేసిన సజ్జల
Sajjala Rama Krishna Reddy: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతి ర్యాలీ చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు.
పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, నాగార్జున యాదవ్ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, మంగళగిరి ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి భరతమాత విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అమరుల కుటుంబాలకు సంఘీబావంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతి సమైక్యత, సౌభ్రాతృత్వమే భారతదేశ ఆత్మ అని, ఈ ఉగ్రవాదుల దాడులతో దాన్ని ఎవరూ చెక్కు చెదర్చలేరని అన్నారు.
పహల్గామ్లో ఉగ్రవాదుల అమానుష దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇది- మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అన్ని మతాలు, అన్ని కులాలు ఇక్కడ సమానమేనని, భిన్నత్వంలో ఏకత్వం అనే పవిత్ర భావనతో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, దాన్ని దెబ్బ కొట్టడానికి తరచూ ప్రయత్నాలు సాగుతున్నాయని పేర్కొన్నారు.
ఉగ్రవాద దాడులు దేశ ప్రజల ఉక్కు సంకల్పాన్ని చెదరగొట్టలేవని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పహల్గామ్ దాడిని మానవత్వంపై జరిగిన హింసగా పేర్కొన్నారు. నరమేథంలో కన్నుమూసిన ఏపీకి చెందిన కుటుంబాలను పార్టీ సీనియర్ నాయకులు పరామర్శిస్తారని చెప్పారు. ఆయా కుటుంబాల వారికి స్వాతంన కలిగిస్తామని చెప్పారు.
ప్రతి ఒక్కరూ నైతికంగా ఆయా కుటుంబాలకు అండగా ఉండాలని కోరుకుంటోన్నామని అన్నారు.ఇలాంటి ఉగ్రవాద చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో తమ పార్టీ భాగస్వామిగా తప్పకుండా ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన సమయం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాలని కోరారు.












Click it and Unblock the Notifications