చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనేక బాధలు పడ్డారంటూ చెప్పడం ఏంటి?
Vangalapudi Anitha: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య.. కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఈ నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో సంభవించిన వరుస హత్యలు, అత్యాచార ఘటనలను రాష్ట్రపతికి వివరించాలని నిర్ణయించింది.

వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీద్ను వినుకొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిలానీ నడిరోడ్డుపై నరికి చంపాడు. చేతులు నరికాడు. మెడపై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటన పట్లపై హోం మంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. గన్ను, లాఠీ పట్టుకుని వైసీపీ వాళ్లను కొట్టలేను కదా అంటూ ఆమె చేప్పడాన్ని తప్పుపట్టింది. వైసీపీ వాళ్లను ఎందుకు కొడతారు, వాళ్లు ఏం చేశారని కొడతారంటూ నిలదీసింది.
దాడులు, అత్యాచారాలు, హత్యలు చేస్తోన్నది తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలేనంటూ గుర్తు చేసింది వైఎస్ఆర్సీపీ. చేతనైతే పచ్చ పార్టీ నాయకులను పట్టుకుని అరెస్టు చేసి శిక్షించండి అంటూ డిమాండ్ చేసింది. జగన్ ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యామంటూ అనిత చెప్పడం పట్ల సవాల్ విసిరింది. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ పేర్కొంది.

తెలుగుదేశం- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 40 రోజుల్లో 30కి పైగా హత్యలు, టీడీపీ వేధింపులకు తట్టుకోలేక 35 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం తమ ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా?, దాదాపు 1,100 కుటుంబాలపై దాడులు జరగడం, 2,700 కుటుంబాలకు పైగా ఊరు విడిచి వెళ్లడం వంటివి జరిగాయా? అని వైసీపీ ప్రశ్నించింది.
రాష్ట్రంలో ఏదో ఒక మూల రోజూ చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరగడం గానీ, శాంతి భద్రతలు ఇంతగా విఫలం కావడం గానీ ఎప్పుడైనా చూశారా? అని నిలదీసింది. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించమని అడుగుతుంటే గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనేక బాధలు పడ్డారంటూ చెప్పడం ఏంటని పేర్కొంది.
టీడీపీ నాయకులు, గూండాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇంతమందిని హత్య చేశారని, పసిపిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ గుర్తు చేసింది. ఎవరి హయాంలో ప్రజలు ఇంతగా నరకం అనుభవిస్తున్నారో ఇప్పుడు చెప్పండని డిమాండ్ చేసింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ ట్వీట్ను పోస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications