తమ్ముడు లోకేష్, జగన్ ఫ్యాక్షనిస్ట్!: 'బాబును అధికారంలోకి తెచ్చేందుకు మళ్లీ పవన్ డ్రామాలు'
ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఆళ్ల నాని బుధవారం హితవు పలికారు. జగన్ను ఫ్యాక్షనిస్ట్గా చిత్రీకరించడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన మానసికస్థితి బాగా లేదన్నారు.
పవన్-జగన్లతో కలిసి దిగితే చెప్పండి: సబ్బం, వారసత్వంపై జనసేనానికి దిమ్మతిరిగే కౌంటర్!
జగన్ను ఫ్యాక్షనిస్ట్ అని జనసేనాని వ్యాఖ్యానించడం సరికాదని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. రాజకీయంగా జగన్ ఎదుగుదలను ఓర్వలేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆయనపై తప్పుడు కేసులు పెట్టాయని మండిపడ్డారు. తమ పార్టీ అధినేతపై పవన్ తప్పుడు ఆరోపణలు మానకుంటే ఆయనకు, జనసేనకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
చంద్రబాబు పిలువలేదు కాబట్టి వెళ్లలేదనటం ఏమిటి?
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నానని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ఢిల్లీకి వెళ్లి ఉద్యమం చేశారా అని ఆళ్ల నాని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలువలేదు కాబట్టి ఢిల్లీకి వెళ్లలేదని జనసేనాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు మళ్లీ పవన్ ప్రయత్నాలు
నవ్యాంధ్ర ప్రదేశ్లో చంద్రబాబు అవినీతి పాలన అంశాన్ని పక్కన పెట్టి వైయస్ జగన్ పైన విమర్శలు చేయడం హాస్యాస్పదంని ఆళ్ల నాని అన్నారు. పవన్ కళ్యాణ్ మరోసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
నారా లోకేష్ను తమ్ముడు ఎందుకు అన్నారు?
అసలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి నారా లోకేష్ను తమ్ముడిగా పవన్ కళ్యాణ్ ఎలా సంభోదిస్తారని ఆళ్ల నాని ప్రశ్నించారు. ప్రజల గోడును విందామని, కళ్లారా చూసేందుకు జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని చెప్పారు. ఇది పవన్కు కనిపించడం లేదా అన్నారు.
పర్యటనలో పేరుతో చంద్రబాబుతో కలిసి పవన్ డ్రామాలు
పవన్ కళ్యాణ్ ఉద్ధానం, మూలలంక ప్రాంతాల్లో పర్యటించి ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. పర్యటనల పేరుతో చంద్రబాబుతో కలిసి పవన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై ప్రసంగాలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎలా వచ్చారని, ఆయన వారసత్వంగానే సినిమా పరిశ్రమలోకి వచ్చారని చెప్పారు.
పవన్ నిలకడలేని మనిషి
కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టకుంటే, కాంగ్రెస్ పార్టీని వీడకుంటే కేంద్రమంత్రి లేదా సీఎం అయ్యేవారని చెప్పారని ఆళ్ల నాని గుర్తు చేశారు. ఈ విషయం పవన్ గుర్తుంచుకోవాలన్నారు. పవన్ నిలగడలేని మనస్తత్వానికి ఆయన మాటలే నిదర్శనం అన్నారు.