చంద్రబాబు, పవన్ సంతకాలకూ విలువ లేదా ? ముందు వాటిని సీజ్ చేయండి..
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా ఇంకా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇవాళ దీనిపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా చంద్రబాబు మోసం అంటూ సుదీర్ఘ ట్వీట్ కూడా పెట్టారు. ఆ తర్వాత వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఇదే అంశంపై ప్రెస్ మీట్ పెట్టి హామీలు ఇచ్చి నిలబెట్టుకోకుండా మోస చేస్తున్న కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
హామీల అమలులో విఫలమైన చంద్రబాబు రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఆరె శ్యామల కోరారు. అధికారం కోసం ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వ వంచన భరించే స్థితిలో మహిళలు లేరన్నారు. ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా చంద్రబాబు అమలు చేయలేని హామీలతో ప్రజలను నమ్మించాడని, రాజకీయాలలో శుష్కవాగ్ధానాలు చేయకూడదు అనే విషయాన్ని ఏనాడు పట్టించుకోలేదని గుర్తుచేశారు.

అక్కచెల్లెమ్మలను మళ్ళీ మళ్ళీ నమ్మించి మోసం చేస్తున్నాడని చంద్రబాబుపై శ్యామల విమర్శలు గుప్పించారు. హామీలు నిలబెట్టుకోలేకపోగా జగన్ ఇస్తున్న పథకాలను నిలిపేసి మహిళలకు తీవ్ర ద్రోహం చేశాడన్నారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున బ్రాండింగ్ చేసుకున్నారని, పవన్ కళ్యాణ్ తో సహా కూటమి నేతలు ఈ హామీలను ఒక పేపర్ లో రాసి, సంతకాలు చేసి మరీ ప్రజలకు వాగ్ధానం చేశారని శ్యామల తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత వీటి ఊసే లేదని, ఆరోజు మీరు పెట్టిన సంతకాల విలువ ఇదేనా? అని ఆమె ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలన్నదే కూటమి నేతల లక్ష్యమని శ్యామల తెలిపారు. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేశారు అనే సామెతను నిజం చేస్తూ నేడు కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ఆడబిడ్డ నిధి పేరుతో 19-59 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్నారని, ఇందుకు అర్హులైన వారు రాష్ట్రంలో 2.7 కోట్ల మంది ఉన్నారని గుర్తుచేశారు. వీరికి మీరు ఇస్తానన్న లెక్క ప్రకారం మొత్తం రూ.37,313 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. తల్లికి వందనం కింద 83 లక్షల మంది విద్యార్ధులకు గానూ ఏడాదికి మొత్తం రూ.12,450 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.
చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి అంటే రాష్ట్ర ప్రజలకు అని అనుకున్నామని, కానీ తమకే ఆ సంపద అని తెలియదని శ్యామల సెటైర్లు వేశారు. దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా గుర్తింపు పొందిన చంద్రబాబును ఈ సందర్భంగా అభినందించారు. ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం అధికారం అనుభవిస్తూ 'సీజ్ ద షిప్' అంటూ డైలాగులు చెప్పడానికే పరిమితమయ్యారని, ప్రజల సమస్యలను ముందు సీజ్ చేయాలని శ్యామల కోరారు.












Click it and Unblock the Notifications