బాలినేనికి వైఎస్ జగన్ పిలుపు
ఒంగోలు: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహార శైలి కొద్దిరోజులుగా చర్చనీయాంశమౌతూ వస్తోంది. సొంత పార్టీ అగ్రనాయకత్వంపై ఆయన అసంతృప్తి, అసహనంతో ఉంటోన్నారు. తన మాట చెల్లుబాటు కావట్లేదని అభిప్రాయంలో ఉన్నారనే వాదనలు లేకపోలేదు.
ఈ ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పదవికీ బాలినేని ఇదివరకే రాజీనామా చేశారు. తన వైఖరిని స్పష్టం చేశారు. అటు పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటోన్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాకు చెందిన కొందరు పార్టీ సీనియర్ నాయకులు తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఫిర్యాదులు చేస్తోన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలనేది బాలినేని డిమాండ్. ఇది నెరవేరట్లేదు.

ఈ పరిణామాల మధ్య- వైఎస్ జగన్ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి పిలుపు అందింది. ముఖ్యమంత్రిని కలుసుకోవాలంటూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సందేశం వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ సమయానికి వైఎస్ జగన్తో బాలినేని భేటీ కానున్నారు. జిల్లా రాజకీయాల్లో బాలినేని ఎదుర్కొంటోన్న ఇబ్బందులను తెలుసుకోనున్నారు వైఎస్ జగన్.
ఇదివరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోనే వైఎస్ జగన్తో బాలినేని సమావేశం అయ్యారు. వైఎస్ఆర్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన అతికొద్ది రోజుల్లోనే బాలినేనిని క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఏప్రిల్ 13వ తేదీన ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో ఈబీసీ నేస్తం పథకం కింద బాలినేనితోనే బటన్ నొక్కించి నిధులను విడుదల చేశారు జగన్.
ఆ తరువాత కూడా బాలినేని అలక వీడలేదు. పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పాతిక సంవత్సరాలుగా తాను విలువలతో కూడిన రాజకీయాలను చేస్తోన్నానని, అవే లేకపోతే రాజకీయాల్లో ఉండలేననీ వ్యాఖ్యానించారు. విలువల కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ తేల్చి చెప్పారు. తన జోలికి వస్తే ఊరుకోబోనని, ఎవ్వరినైనా ఎదరిస్తాననీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఆయన జగన్ను కలుసుకోబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications