చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి- ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా : పశ్చిమ వైసీపీలో కలకలం..!!
పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా మాజీ మంత్రి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ను గెలిపించినందుకు తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నానంటూ... చెప్పుతో బహిరంగ సభలో కొట్టుకోవటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
అనంతరం బైక్ ర్యాలీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. అసమర్ధుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపురం ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని చెబుతూనే తన చెప్పుతో కొట్టుకున్నారు. పక్కన ఉన్న నేతలు ఆయన్ను వారించారు. అయితే, కొత్తపల్లి సుబ్బారాయుడు నియోకవర్గంలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన గతంలో టీడీపీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ప్రసాదరాజు పైన గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి రెండో సారి ప్రసాదరాజు వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి వీరిద్దరూ ఇదే నియెజకవర్గంలో ప్రత్యర్ధి పార్టీల నుంచి ఒకరి పైన ఒకరు పోటీ చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం కొత్త జిల్లాల నేపథ్యంలో నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ సమయంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు మౌనంగా ఉంటున్నారు.
దీని పైన నిరసనల్లో పాల్గొంటున్న వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తో ఉన్న విభేదాల తో ఒక్కసారిగా కొత్తపల్లి సుబ్బారాయు తన ఆగ్రహం మొత్తాన్ని ప్రదర్శించారు. తన చెప్పుతో తానే కొట్టుకోవటం ద్వారా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. ఇప్పుడు ఆయన చెప్పుతో కొట్టుకుంటున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం పైన వైసీపీ అధినాయకత్వం ఏ రకంగా స్పందిస్తుందీ.. ఎమ్మెల్యే ప్రసాదరాజు రియాక్ట్ అవుతారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే నర్సాపురం ఎంపీతో సమస్యలు ఎదుర్కొంటున్న వైసీపీకి ఇప్పుడు ఇది మరో సమస్యగా మారనుంది.