జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి-టీడీపీని తీసుకోవాలి-అమిత్ షా భేటీపై లక్ష్మీపార్వతి కామెంట్స్
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.వైసీపీ నేతలంతా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీని బలంగా కోరుకుంటున్నారు. అలాగని వైసీపీలోకి రమ్మని మాత్రం కోరడం లేదు. టీడీపీ పగ్గాలు చేపట్టమని డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ సన్నిహితుడు కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ నేతలు ఇవే డిమాండ్లు చేస్తుండగా.. ఇవాళ లక్ష్మీపార్వతి కూడా అదే జాబితాలో చేరారు.
ఇవాళ తిరుపతిలో తెలుగు అకాడమీ వ్యవహారాలపై ప్రెస్ మీట్ నిర్వహించిన లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్-అమిత్ షా భేటీపై మీడియా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయితే రేపు దీనిపై స్పందిస్తానని చెప్పిన మీడియా ప్రతినిధులు ఆమెను వదల్లేదు. దీంతో ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ పై మాత్రం స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనికోరుకుంటున్న వాళ్లలో తాను కూడా ఉన్నానంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని గతంలోనూ లక్ష్మీపార్వతి పలుమార్లు చెప్పారు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలంటూ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దీనిపైనా లక్ష్మీపార్వతి స్పందించారు. ఆయన త్వరలోనే వచ్చి టీడీపీని తీసుకోవాలని కోరుకుంటున్నాననన్నారు. అబ్బాయికి నా ఆశీస్సులు అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్-అమిత్ షా భేటీలో ఏం జరిగిందనే అంశంపై మాట్లాడేందుకు మాత్రం లక్ష్మీపార్వతి నిరాకరించారు. వారిద్దరి భేటీలో ఏం జరిగిందో తనను అడిగేతే ఏం చెప్తానంటూ సరదాగా ప్రశ్నించారు.