'బాబు పాలనలో అవినీతి పెరిగింది': 'ఎన్నాళ్లని ఇలా అబద్దాలు చెప్పుకుంటూ పోతారు'
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఏపీకి చేసేందేమీ లేదని విమర్శించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా ఆయన రాబట్టలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో కూడా రైతులకు అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు తప్పుడు నిర్ణయాల వల్లే రైతులు డిఫాల్టర్లుగా మారారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. నవ నిర్మా దీక్షల పేరిట ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ధర్మాన హితవు పలికారు.
అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు: పార్ధసారధి
చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో ఏపీ ప్రజలకు చేసేందేమీ లేదని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ఎంతసేపటికీ అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
జూన్ 2న చంద్రబాబు చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో నిజాలు చెబితే బాగుండేదని అన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేశామని, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చామని, డ్వాక్రా మహిళలు రుణాల బారిన లేరని చెబితే బాగుండేదని అన్నారు. అసలు చంద్రబాబుకు అలా చెప్పుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు.
ఎన్నాళ్లని ఇలా అబద్దాలు చెప్పుకుంటూ పోతారని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బలహీన వర్గాల సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. ఏడాదిలోగా పట్టిసీమ పూర్తి చేసి గోదావరి కృష్ణా జలాల అనుసంధానం జరిగిందని చెప్తున్నారని, అలా ఎక్కడ జరిగిందో చూపించాలని చంద్రబాబుని నిలదీశారు.
కృష్ణా జలాలతో ఎన్ని ఎకరాలకు నీరిచ్చారని ప్రశ్నించారు. కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు ఏమయ్యాయని అడిగారు. చంద్రబాబు రెండేళ్ల పాలనపై బుధవారం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని చెప్పారు.