వైసీపీ ఎమ్మెల్యేలకు సజ్జల కీలక సూచన - ఫైనల్ ఎగ్జామ్- అలా చేస్తేనే పాస్ మార్కులు..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవ్వాళ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని,ఆ తరువాత పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకుని ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని పేర్కొన్నారు.
పాస్ కావాలి..
పార్టీకి చెందిన ప్రతి శాసన సభ్యుడు కూడా నేరుగా ప్రతి ఇంటినీ, సంక్షేమ పథకాల లబ్దిదారులను స్వయంగా కలుసుకోవాల్సి ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. లబ్దిదారులను కలుసుకోవడం వల్ల వారి నుంచి వచ్చే స్పందనను తెలుసుకోవడానికి వీలు కలుగుతుందని, దీనితో వారు పాస్ అయిపోతారని చెప్పారు. వైఎస్ జగన్ కూడా కోరుకునేది అదేనని ఆయన వివరించారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఎలా ఉందనే విషయం పార్టీ చేపట్టే సర్వేల్లో ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారాయన
ప్రజా ప్రతినిధుల విధి..
నేరుగా ప్రజలు, లబ్దిదారులను కలుసుకోవాలంటూ తమకు వైఎస్ జగన్ ఆదేశించినట్లుగా ఎమ్మెల్యేలు భావించకూడదని, ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పాస్ కావాలంటే- శాసనసభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులందరూ తమను గెలిపించిన ప్రజలను కలుసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారాయన. ఈ సైంటిఫిక్ ఫార్ములాను తామే కాదు- అన్ని పార్టీలు కూడా అనుసరిస్తోన్నాయని సజ్జల చెప్పారు.
లక్ష్యం అదొక్కటే..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 గెలిచి తీరాలనే లక్ష్యాన్ని నిర్దేశించామని, దాన్ని సాధించడానికి సూక్ష్మస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాల గురించి- ఈ వర్క్షాప్లో వైఎస్ జగన్ వివరించారని సజ్జల తెలిపారు. గ్రామస్థాయిలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, పార్టీపరంగా విభేదాలు తలెత్తకూడదని సూచించినట్లు చెప్పారు. దీనికోసం అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు సమర్థవంతంగా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
చేయాల్సింది చేస్తోన్నారు..
175కు 175 సీట్లను సాధించడానికి జిల్లా అధ్యక్షులు ఏం చేయాలి?, శాసన సభ్యులు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? అనే విషయాలపై ఇందులో చర్చించామని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తాను చేయాల్సింది చేస్తోన్నారని, ప్రభుత్వం తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తోందని వివరించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 95 శాతాన్ని అమలు చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో 175 స్థానాలను ఎందుకు సాధించలేమని జగన్ వారికి సూచించినట్లు చెప్పారు
ఫైనల్ ఎగ్జామ్..
ఫైనల్ ఎగ్జామ్ రాసేముందు ఓ విద్యార్థి ఎంతగా కసరత్తు చేస్తాడో.. ఇప్పుడు ప్రతి శాసన సభ్యుడు కూడా అదే స్థాయిలో ప్రిపేర్ కావాల్సి ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఓటర్ల నుంచి ఆశీర్వాదాన్ని, వారి ఆదరణను పొందడానికి ప్రభుత్వం, పార్టీపరంగా ఏ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందో.. అవి కొనసాగుతూనే ఉంటాయని ఆయన అన్నారు. శాసన సభ్యులకు ప్రజాదరణను చూరగొనడానికి పార్టీ పూర్తిగా సహకరిస్తుందని అన్నారు.
డెడ్ లైన్..
కొందరు పార్టీ శాసన సభ్యులు తమ వైఖరిని మార్చుకోవడానికి వైఎస్ జగన్- ఏప్రిల్ వరకు డెడ్ లైన్ విధించినట్లు వస్తోన్న వార్తలపై సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ప్రతి నెలా కూడా డెడ్లైన్లు వస్తూనే ఉంటాయని, ఏ సమయంలో దాన్ని ఆధారంగా చేసుకుని ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనేది పార్టీ అధ్యక్షుడు తుది నిర్ణయిం తీసుకుంటారన వ్యాఖ్యానించారు.