ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు..!!
అమరావతి: తెలుగుదేశం- జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో ఇటీవల సంభవించిన ఘటనలకు చంద్రబాబే బాధ్యుడని, పవన్ కల్యాణ్ ఆయనను వెనకేసుకొస్తోన్నాడంటూ ఆరోపించారు. మెగాస్టార్ చిరంజీవికీ చురకలు అంటించారు.
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉద్దేశపూరకంగా పుంగనూరులో అల్లర్లకు పాల్పడ్డారని సజ్జల స్పష్టం చేశారు. దీనిపై ఆయన సాక్ష్యాధారాలతో సహా దొరికారని గుర్తు చేశారు. తన కార్యకర్తలను రెచ్చగొడుతూ చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు.

అయినప్పటికీ.. దొంగే దొంగ అని అరిచినట్టు చంద్రబాబు ప్రవర్తిస్తోన్నారని సజ్జల ధ్వజమెత్తారు. పుంగనూరులో పోలీసులతో కాల్పులు జరిపించేలా కుట్ర పన్నారని, ఆ పాచిక పారలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు ఎంతో సహనంతో వ్యవహరించారని, తమపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నప్పటికీ.. వారు సహనాన్ని, సంయమనాన్ని కోల్పోలేదని ప్రశంసించారు.
చంద్రబాబును గుంటనక్కగా అభివర్ణించారు సజ్జల. దీనిపై సీబీఐతోనో.. ఇంకో దర్యాప్తు ఏజెన్సీతోనో విచారణ జరిపించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పుంగనూరు ఘటనలో చంద్రబాబు సహా.. కిందిస్థాయి కార్యకర్త వరకూ అడ్డంగా దొరికారని చెప్పారు. ఈ విషయంలో ఎవ్వర్నీ ఉపేక్షించబోయేది లేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారని అన్నారు.
పుంగనూరు వంటి దాడులను చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా లేవదీయాలని ప్లాన్ చేశాడని, అల్లర్లు సృష్టించి- రాజకీయ లబ్ది పొందే వికృతక్రీడకు కుట్ర పన్నారని సజ్జల విమర్శించారు. రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడాలనుకునే వారికి గుణపాఠం తెలిపేలా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉండోబోతోన్నాయని అన్నారు.
పుంగనూరులో పోలీసులపై దాడులకు పాల్పడిన ఘటనలో పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రశ్నించట్లేదని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ను తప్పుపట్టిన పవన్ కల్యాణ్.. అదే పోలీసులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు, విధ్వంసాలకు పాల్పడితే ఎందుకు స్పందించట్లేదని అన్నారు.
ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలనూ సజ్జల తప్పుపట్టారు. ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సమయంలో చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. అప్పుడు చిరంజీవి కాంగ్రెస్లో, ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ ఎన్డీఏలో ఉన్నారని, ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications