వల్లభనేని వంశీ మౌనం వెనుక - ఏకమైన వ్యతిరేకులు: గన్నవరం వైసీపీలో కొత్త సమీకరణాలు..!!
గన్నవరం వైసీపీలో ఏం జరుగుతోంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపికి దగ్గరమైన వల్లభనేని వంశీ మౌనం వెనుక కారణమేంటి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ..ఆ కొద్ది కాలానికే వైసీపీ నేతలకు దగ్గరయ్యారు. చంద్రబాబు - లోకేష్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. తన స్నేహితుడు నాటి మంత్రి కొడాలి నాని తో కలిసి వైసీపీకి మద్దతుగా తన వాయిస్ వినిపించారు. అయితే, కొంత కాలంగా వంశీ మౌనంగా ఉంటున్నారు. గన్నవరం వైసీపీలో పార్టీ నేతలుగా ఉన్న వెంకటరావు..రామచంద్రరావు మద్దతు దారులు వంశీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.

వల్లభనేని వంశీ మౌనంతో...
ఇదే అంశం పైన పార్టీ నేతలతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దాలని ప్రయత్నించినా...వ్యవహారం అలాగే కొనసాగుతోంది. కొద్ది కాలం క్రితం వంశీకి వ్యతిరేకంగా గన్నవరం వైసీపీ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డిని కలిసి..వంశీకి ఇన్ ఛార్జ్ పదవి ఇస్తే గన్నవరంలో పార్టీ గెలవదని..మరెవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేసారు. లేఖ కూడా అందించారు. ఇక, ఇప్పుడు పార్టీ నిర్ణయించిన గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇదే సమయంలో మరోసారి నియోజకవర్గంలోని వంశీ వ్యతిరేకులు ఒక్కటయ్యారు.

ఏకమైన వంశీ వ్యతిరేకంగా
గన్నవరంలో వైసీపీ కొత్త ఇంఛార్జ్ ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వాటి పైన ఇది మా ఇంట్లో పండుగ. మమ్మల్ని మాత్రమే నిర్వహించుకోనివ్వండి. బయటి వారి జోక్యం అవసరం లేదు అని అంటూ ప్రదర్శించారు. వంశీ వ్యతిరేకంగా ఉన్న వారంతా కలిసి ఛలో తాడేపల్లికి నిర్ణయించారు. గన్నవరం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. గతంలోనే వెంకటరావు - వంశీ మధ్య సయోధ్య దిశగా పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేసారు. జిల్లా మంత్రిగా ఉన్న కొడాలి నాని సైతం నియోజకవర్గంలో అందరూ కలిసి పని చేసుకోవాలని అప్పట్లో సూచించారు.

వంశీతో కలిసేది లేదంటూ ఫ్లెక్సీలు - ర్యాలీలు
అయితే, వంశీ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తమపైన కేసులు పెట్టించి...వేధించారని తాము కలిసి పని చేయలేమంటూ సొంత పార్టీలోని వ్యతిరేక వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది గా వంశీ పోటీ చేస్తారనే ప్రచారంతో పార్టీ లోని వ్యతిరేక శ్రేణులు ఒక్కటయ్యారు. ఎవరికి సీటు వచ్చినా..వంశీకి మాత్రం సీటు దక్కకుండా చూడాలనే వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. దీంతో..ఇప్పుడు పార్టీ అధినాయకత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, వంశీకి మద్దతుగా ఆయనతో పాటుగా టీడీపీ నుంచి వచ్చిన వారు మినహా.. వైసీపీ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో సహకారం అందటం లేదు. అదే విధంగా అటు చీరాల లోనూ టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన కరణం బలరాం వర్సస్ ఆమంచి అన్నట్లుగా అక్కడ మద్దతు దారుల వ్యవహారం మారింది.

హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ
అయితే, 2024 ఎన్నికల పైనే ఇప్పటికే ఫోకస్ పెట్టిన సీఎం జగన్..ప్రతీ సీటును కీలకంగా భావిస్తున్నారు. అయితే, గతంలో పలు మార్లు సీఎంను కలిసిన వంశీ..ఈ మధ్య కాలంలో సీఎంతోనూ భేటీ అయిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. దీంతో..వంశీ ఆలోచనలు ఏంటి... గన్నవరం విషయంలో వైసీపీ ముఖ్య నాయకత్వం ఏం చేయబోతోంది...గన్నవరం పంచాయితీకి ఎలాంటి ముగింపు ఇస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications