అంతకు మించి.. 'మహానాడు' కన్నా గ్రాండ్ సక్సెస్గా..
తెలుగుదేశం పార్టీ ఒంగోలులో నిర్వహించిన 'మహానాడు' విజయవంతమైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఒంగోలుకు తీసుకురావడానికి ఆర్టీసీ బస్సులు అడగినప్పటికీ ప్రభుత్వం నిరాకరించడంతో ప్రయివేటు వాహనాల్లో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈస్థాయిలో మహానాడు విజయవంతమవుతుందని ఊహించని రాజకీయవర్గాలు ఆశ్చర్యపోయాయి. తాజాగా ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరు-విజయవాడ మధ్య జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అంతకు మించి విజయవంతమయ్యేలా కృషిచేయాలని అధిష్టానం నేతలకు లక్ష్యాన్ని నిర్ధేశించింది.
ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు తాత్కాలికంగా పీఎంవో కార్యాలయాన్ని ఒక గుడారంలో ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఈ రెండురోజులు ముఖ్యమంత్రి జగన్ తన సీఎంవో కార్యాలయాన్ని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. ప్లీనరీ సందర్భంగా ఆరు లక్షల మంది తరలివస్తారని అంచనాలుండుటంతో అందుకు తగ్గట్లుగా భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్కు ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించడంతో రవాణాశాఖ ఏర్పాట్లలో తలమునకలైంది.
వర్షం పడినా తడవకుండా ఉండేలా జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి పైకప్పు వేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ప్లీనరీ కావడంతో ఎట్టి పరిస్థితుల్లోను గ్రాండ్ సక్సెస్ చేయాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు అప్పజెప్పారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మహానాడు తర్వాత ఆ పార్టీలో జోష్ పెరిగిందని, అంతకుమించి పార్టీ కార్యర్తల్లో ఉత్సాహం నింపేలా ప్లీనరీ రెండురోజులు జరగాలని వైసీపీ నేతలు కృషిచేస్తున్నారు.