అనంతపురంలో వైఎస్ఆర్ సీపీ నేతలు హౌస్ అరెస్టు
అనంతపురం: అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తుంగభద్ర ఆయకట్టు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళన మరింతపెరిగింది. శనివారం బలవంతంగా తుంగభద్ర ఆయకట్ట నీరు విడుదల చెయ్యడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిద్దం అయ్యారు. ఆ సమయంలో పోలీసులు వారిమీద ఆంక్షలు విధించారు.
అయినా వైఎస్ఆర్ సీపీ నాయకులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ పార్టీకి చెందిన అనంత వెంకట్రామి రెడ్డి, పద్మావతి, గురనాథరెడ్డి తదితరులను శనివారం హౌస్ ఆరెస్టు చేశారు.
తమ పార్టీ నేతల మీద ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తున్నదని, అందుకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చెయ్యడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.