'గుంటూరు కారం'పై 'బ్రో' ఎఫెక్ట్?
గురూజీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎఫెక్ట్ తాజాగా గుంటూరు కారంపై పడుతోంది. ఒకరకంగా బ్రో సినిమా ఎఫెక్ట్ అనవచ్చు. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ సినిమా కాబట్టి సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై త్రివిక్రమ్ ఈ సినిమాను నడిపించిన సంగతి తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వం వహించినప్పటికీ త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.
పవన్ కల్యాణ్ కు త్రివిక్రమ్ పై ఉన్న నమ్మకాన్ని బట్టి అలా నడుస్తుంది. కానీ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం త్రివిక్రమ్ అంటే నమ్మకం లేదు. వారంతా ఆయనపై మండిపడుతున్నారు. పవన్ మాట్లాడే మాటలన్నింటినీ రాసిచ్చేది గురూజీ కావడమే వారి ఆగ్రహానికి కారణం.

మంత్రి అంబటి రాంబాబు స్వయంగా గురూజీని హెచ్చరించిన సంగతి తెలిసిందే. బ్రో సినిమా కోసం గుంటూరు కారం షూటింగ్ ఆలస్యమైంది. దీనివల్ల నటీనటుల కాల్షీట్లు వృథా అవడంతోపాటు ఇప్పుడు కావాలంటే దొరకడంలేదు. హీరోయిన్, ఫొటోగ్రఫీ డైరెక్టర్ మారడంతోపాటు సంగీత దర్శకుడు తమన్ కూడా సినిమా నుంచి ఔట్ అంటూ వార్తలు వస్తున్నాయి. హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి ఖరారయ్యారు.
వైసీపీ శ్రేణులు త్రివిక్రమ్ ను టార్గెట్ గాచేసుకోవడంతో ఆ ప్రభావం గుంటూరు కారంపై పడుతోందని సినీ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు ఎక్కువగా పెంచుకోవడానికి ప్రభుత్వాన్ని కలవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు రాసిస్తున్న త్రివిక్రమ్ సినిమా అంటే టికెట్లను పెంచుకోవడానికి అనుమతిచ్చేది లేదని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఆలోచనల వెనక, మాటల వెనక గురూజీ ఉన్నాడనే అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉంది. బ్రో సినిమాతో ఇది మరింత బలపడింది. మున్ముందు త్రివిక్రమ్ తో సినిమాలు తీసే నిర్మాతలు, హీరోలకు కష్టకాలమేనని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications