వైసీపీ చేజారిన కీలక మున్సిపాలిటీ-అధికారికంగా కూటమి కైవసం..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలను ఏకపక్షంగా కైవసం చేసుకున్న వైసీపీ ఇప్పుడు పరిస్ధితులు మారడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. స్థానిక సంస్థల్లో తమ ప్రజాప్రతినిధుల్ని కాపాడుకోవడం అత్యంత కష్టంగా మారిన వేళ.. ఇవాళ ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
అదీ అత్యంత కీలకమైన పల్నాడులోనే కావడం విశేషం.
పల్నాడు జిల్లాలోని మాచర్ల మున్సిపాలిటీలో నిన్న మొన్నటి వరకూ అధికారం చెలాయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం కోల్పోయింది. కూటమి సర్కార్ రావడంతోనే ఈ కీలక మున్సిపాలిటీపై కన్నేసింది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగులగొట్టిన ఘటనలో జైలుకెళ్లడంతో వ్యూహాత్మకంగా పావులు కదిపిన అధికార కూటమి ఆ పార్టీ కార్పోరేటర్లను తమవైపుకు తిప్పుకుంది. దీంతో ఏకంగా 16 మంది వైసీపీ కార్పోరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు.

ఇదంతా ముందే ఊహించిన మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఏసోబు ఇప్పటికే రాజీనామా ప్రకటించారు. దీంతో ఆయన స్ధానంలో టీడీపీలో చేరిన వైస్ ఛైర్మన్ పోలూరు నరసింహారావును ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో పోలూరు నరసింహారావు చైర్మన్ గా ఇవాళ ప్రమాణస్వీకారం కూడా చేశారు. పోలూరు నరసింహారావు ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులు ఉండగా... ఇటీవలే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తాజాగా 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది.












Click it and Unblock the Notifications