సీమలో వారి పట్టు సడలిందా - ఎవరికెన్ని సీట్లు, గేమ్ ఛేంజర్..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా సాగింది. గెలుపు పైన పార్టీల్లో అంచనాలు పెరుగుతున్నాయి. మెజార్టీ సీట్ల పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ, పోలింగ్ సరళి మాత్రం నేతల అంచనాలకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రధానంగా వైసీసీకి కంచుకోటగా చెప్పుకొనే రాయలసీమలో ఈ సారి ఓటరు తీర్పు అనూహ్యంగా ఉంది. పోలింగ్ సరళి విశ్లేషణలో ఆసక్తి కర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ మారుతున్న లెక్కలతో మొత్తంగా రాష్ట్ర ఫలితం పైనే అంచనాలు మారుతున్నాయి.
మారుతున్న లెక్కలు
రాయసీమలోని నాలుగు జిల్లాల్లో ఓటరు తీర్పు పైన విశ్లేషణ మొదలైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ రెండు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. కడప, కర్నూలులో టీడీపీకి ఒక్క సీటు దక్కలేదు. అదే విధంగా చిత్తూరు లో చంద్రబాబు, అనంతపురం జిల్లాలో రెండు సీట్లను మాత్రమే టీడీపీ గెలిచింది. మొత్తం 52 స్థానాల్లో 49 సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఈ సారి కూడా ఇదే పట్టు కొనసాగించాలని వైసీపీ తొలి నుంచి వ్యూహాలను అమలు చేసింది. చంద్రబాబు పోటీ చేసిన కుప్పం..బాలయ్య హ్యట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న హిందూపురం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

వైసీపీకి కలిసొచ్చేనా
ఈ నెల 13న జరిగిన పోలింగ్ తరువాత పార్టీలు ఓట్ల సరళిని పరిశీలించారు. ఎవరికి ఎక్కడ గెలిచే అవకాశం ఉందనే లెక్కలు వేసారు. వైసీపీ అంచనా వేస్తున్నట్లుగా గతంలో సాధించిన స్థానాలు తిరిగి దక్కటం కష్టమనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లుగా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ లేదనేది మరో వాదన. దీంతో..జిల్లాల వారీగా విశ్లేషణలు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో అధికార వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధిస్తుందనే ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. టీడీపీకి తొలి నుంచి మంచి పట్టు ఉన్న జిల్లాలో మాత్రం గట్టి పోటీ ఉందని..సగం సీట్లు గెలిచే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అదే సమయంలో మరో కీలక జిల్లా పైన ఇప్పుడు ఆసక్తికర లెక్కలు బయటకు వస్తున్నాయి.
ఇక్కడి మెజార్టీనే కీలకం
ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఆ జిల్లాలో ఈ సారి అనూహ్య ఫలితాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఒక కీలక నియోజకవర్గంలో వచ్చే ఫలితం రాష్ట్రంతో పాటుగా దేశం మొత్తం చర్చకు కారణంగా నిలుస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అదే జిల్లాలో గతం కంటే మెరుగ్గా ఒక ప్రధాన పార్టీ అభ్యర్దులు సీట్లు గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. 52 స్థానాల్లో 40 స్థానాలు గెలుస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా..టీడీపీ కూటమి సైతం ఈ సారి సీమలో తమ సీట్లు భారీగా పెరుగుతాయని చెబుతున్నారు. కానీ, ఇక్కడ సాధించే మెజార్టీ సీట్లు తమకు అధికారంలో కీలకం కాబోతున్నాయని..ఫలితాల రోజున ఇది స్పష్టం అవుతుందని వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు. దీంతో..సీమ జిల్లాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications