అందిపుచ్చుకున్న వైసీపీ- భారీ నిరసన: రారనుకున్న సీనియర్లందరూ ఒకే వేదికపైకి.. !!
గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. డీఎస్సీలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న అక్రమాలను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీలు గురు పరిరక్షణ దీక్ష నిర్వహించారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, అనర్హులను గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనేది వారి ప్రధాన డిమాండ్.
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేష్బాబు, ఇసాక్, కల్పలత రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్కుమార్, రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, పర్వతనేని చంద్రశేఖర్రెడ్డి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.

పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు తానేటి వనిత, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, పేర్ని నాని, పలువురు మాజీ ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడారు. మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు సంబంధించి రోజుకో కొత్త అంశం బయటకు వస్తోందని, అనర్హులు టీచర్లుగా నియమితులైనట్లు ప్రభుత్వం స్వయంగా తేల్చిందని చెప్పారు.
నాలుగైదు జిల్లాల్లో రహస్యంగా విచారణ జరుగుతున్నట్లు పత్రికల్లో వస్తున్న వార్తలు చూస్తుంటే మెగా డీఎస్సీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా, అక్రమాలకు నిలయంగా మారిందో అర్థమవుతోందని అన్నారు. నోటిఫికేషన్ జారీ నుంచి టీచర్ల నియామకాల వరకు అడుగడుగునా అక్రమాలు జరిగిన విషయం ఇప్పటికే స్పష్టమైందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో పాటు తప్పుడు రిజర్వేషన్లను ఉపయోగించి ఉద్యోగాలు పొందినట్లు రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోందని చెప్పారు.
కాసులకు కక్కుర్తి పడి చేసిన అక్రమాల పాపం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని కురసాల కన్నబాబు అన్నారు. ఉపాధ్యాయులు భావితరాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత కలిగినవారని, అలాంటి పోస్టుల్లోనే నకిలీలకు చోటు కల్పిస్తే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. గురువుల వ్యవస్థను కలుషితం చేసే ఇలాంటి చర్యలు భావితరాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని స్పష్టం చేశారు.
డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన కూడా లేదని కురసాల కన్నబాబు అన్నారు. ఇన్ని ఆధారాలు, ఇన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు.
'మేం తప్ప ఎవరూ మెగా డీఎస్సీ నిర్వహించలేరు..' అంటూ చంద్రబాబు, నారా లోకేష్ గొప్పలు చెప్పుకున్నారని మాజీ మంత్రి తానేటి వనిత ఎద్దేవా చేశారు. తమకంటే గొప్పగా ఎవరూ లేరన్నట్టుగా విర్రవీగిన కూటమి నేతలకు మెగా డీఎస్సీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడిందని గుర్తు చేశారు. తీరా చూస్తే మెగా డీఎస్సీ మొత్తం అక్రమాల పుట్టగా తేలిపోయిందని విమర్శించారు. నిజాయితీగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.














Click it and Unblock the Notifications