వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు: రంగా హత్యోదంతంతో: ఆనాటి పౌరుషం ఏమైంది: సరికొత్త డిబేట్స్
గుంటూరు: రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం కాపు సామాజిక వర్గం చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందటే కాపు నాయకులు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం సాగింది. వేర్వేరు పార్టీలకు చెందిన కాపు సామాజిక వర్గ నాయకులు, ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా అదే సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధా ఇంటికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది.
టీడీపీ హయాంలోనే..
దీనిపై కాపు సామాజిక వర్గానికే చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు అంబటి రాంబాబు స్పందించారు. వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు వెళ్లిన ఉదంతాన్ని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో పోల్చారు. రాధా తండ్రి వంగవీటి రంగా దారుణ హత్యకు గురైన సంఘటనను రాంబాబు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉందనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు.
గేట్లు మూసిశారుగా..
వంగవీటి రంగా దారుణ హత్యకు గురైన అనంతరం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇంటికి వెళ్లగా.. గేట్లు మూసివేశారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. గేట్లు మూసివేయడంతో రంగా కుటుంబ సభ్యులను పరామర్శించకుండానే ఎన్టీ రామారావు వెనుదిరిగారని అన్నారు. ఇప్పుడు వంగవీటి రంగా కుమారుడు రాధా ఇంటికి అదే తెలుగుదేశం పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు వెళ్లగా గేట్లు తెరచుకున్నాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు-వంగవీటి చుట్టూ..
చంద్రబాబు తాను స్వయంగా వంగవీటి రాధా ఇంటికి వెళ్లడం పట్ల అటు వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు భిన్నంగా స్పందిస్తోన్నారు. వంగవీటి రాధా త్వరలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పబోతోన్నారని, అందుకే- ఆయనను బుజ్జగించడానికే చంద్రబాబు రంగంలోకి దిగారని చెబుతున్నారు. టీడీపీలో కొనసాగడానికి వంగవీటి రాధా ఏ మాత్రం సుముఖంగా లేరని తేల్చేస్తున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సైతం రంగాను ఆయన నివాసంలో కలుసుకున్న విషయాన్ని గుర్తు చేస్తోన్నారు.
వైసీపీ క్యాడర్ ఏం చెబుతోంది..
పలువురు సీనియర్ నాయకులు, మాజీమంత్రులు రాధాను బుజ్జగించినప్పటికీ వినట్లేదని, అందువల్లే చంద్రబాబు బరిలో దిగాల్సి వచ్చిందని అంచనా వేస్తోన్నారు వైసీపీ నాయకులు. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు వంగవీటి రాధా బయటికి వెళ్తే.. పార్టీ ఓటుబ్యాంకు మరింత నష్టపోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తోన్నారు. మరోవంక- తెలుగుదేశం పార్టీ నాయకులు వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. ఈ విషయంలో వారు వైఎస్ఆర్సీపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఆ పార్టీ నాయకులు చేస్తోన్న విమర్శలను తిప్పి కొడుతున్నారు.
టీడీపీ కౌంటర్ అటాక్..
వంగవీటి రాధాను హత్య చేయడానికి దేవినేని అవినాష్ తరఫు మనుషులు రెక్కీ నిర్వహించారని, ఆయనకు ప్రాణాపాయం ఉందంటూ ఆరోపిస్తోన్నారు. రాధా వెంట పార్టీ మొత్తం ఉందనే సందేశాన్ని చంద్రబాబు ఇచ్చారని చెబుతున్నారు. ఆయనకు ఎలాంటి హాని కలిగినా.. దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆరోపిస్తోన్నారు. వంగవీటి రాధా పార్టీలోనే కొనసాగుతారని, ఆయన బయటికి వెళ్తారనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చెబుతున్నారు టీడీపీ నాయకులు.