వైసీపీ ఎమ్మెల్యే ఆనం కలకలం- అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు-కాకాణి సీరియస్
వైసీపీ 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. ఈ జిల్లాలో ఉన్న 10 సీట్లలో పదీ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అయితే ఇదే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తోంది. జిల్లాలో పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు జిల్లా అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తే మరొకరికి కోవం, మరొకరిని వ్యతిరేకిస్తే ఇంకొకరికి తాపం అన్నట్లుగా అక్కడ పరిస్ధితి తయారవుతోంది. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలో అధికారుల తీరుపై ఓ వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఏకంగా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
నెల్లూరు పాలిటిక్స్
ఏపీలో ప్రస్తుతం వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. ఇక్కడ నుంచి మంత్రులుగా అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి ఉన్నారు. రెండేళ్ల క్రితం వీరిద్దరితో పోటీ పడి మంత్రి పదవులు కోరుకున్న కొందరికి నిరాశే మిగిలింది. ఆ తర్వాత వీరికి వైరి వర్గాలు తయారయ్యాయి. అదే సమయంలో వీరిద్దరి మధ్య కూడా పొసగని పరిస్ధితి. ఇక వైసీపీ ఎమ్మెల్యేల పరిస్ధితి మరీ దారుణం. పేరుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నట్లుగా పరిస్దితి మారిపోయింది. దీనికి ప్రధాన కారణం జిల్లాలో నెలకొన్న ఆధిపత్య పో
వెంకటగిరిలో ఆనంకు అధికారుల షాకులు
జిల్లాలోనే సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సొంత ప్రభుత్వం అధికారంలో ఉండగానే షాకులు తగులుతున్నాయి. సొంత జిల్లాలోనే తన ప్రాభవం తగ్గుతుందని ఇప్పటికే ఆందోళన చెందుతున్న ఆయనకు జిల్లా అధికారులు వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రోటోకాల్ వ్యవహారాల్లో ఆనంను చూసీ చూడనట్లు వదిలేస్తున్న అధికారులు.. ఈసారి ఆగస్టు 15 సందర్భంగా పతాకావిష్కరణకు సైతం ఆహ్వానించలేదు. దీంతో సొంత ప్రభుత్వంలోనే ఆనంకు భారీ షాక్ తగిలినట్లయింది.
అధికారులపై ఆనం ఫైర్
నెల్లూరు జిల్లా అధికారులు ప్రోటోకాల్ విషయంలో తనను ప్రతిసారీ పట్టించుకోవడం లేదని భావిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి తాజా పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆగష్టు 15వ తేదీన ప్రజాప్రతినిధులను జెండా వందన కార్యక్రమానికి పిలవలేదని ఆయన వాపోతున్నారు. మాజీ మంత్రి అయిన తన పరిస్ధితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్ధితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కానీ ఆనం ప్రశ్నలకు అధికారులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రివిలేజ్ కమిటీకి ఆనం ఫిర్యాదు
జిల్లా అధికారుల తీరుపై విసిగిపోయిన ఆనం రామనారాయణ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయిన తనను జిల్లా అధికారులు తీవ్రంగా అవమానిస్తున్నారని అసెంబ్లీ సభా హక్కుల కమిటీకి ఆయన ఫిర్యాదు చేశారు. జిల్లాలో సీనియర్ నేత అయిన తనపై వివక్ష చూపుతున్నారని, వైసీపీ ఎమ్మెల్యే అయిన తన హక్కుల్ని కాలరాస్తున్నారని ప్రివిలేజ్ కమిటీకి ఆనం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీ కి ఆయన రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని దీనిపై విచారణ జరపాలని ఆనం కోరారు.దీంతో ఈ వ్యవహారం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Recommended Video
ఆనం ఫిర్యాదు సీరియసే అన్న కాకాణి
నెల్లూరు జిల్లా అధికారులు వైసీపీ ఎమ్మెల్యే అయిన తన హక్కుల్ని కాలరాస్తున్నారని ప్రోటోకాల్ అమలు చేయడం లేదని ఆనం రామనారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్, జిల్లా నేత కూడా అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. దీనిపై ప్రాధమికంగా విచారించిన అసెంబ్లీ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇతర సభ్యులు ఆనం రాంనారాయణ రెడ్డి ఫిర్యాదును నెల్లూరు జిల్లా పర్యటనలో పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా ప్రతినిధులను జండా వందనానికి పిలవకపోవడంను సీరియస్ గా పరిగణించాల్సిన అంశమేనని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి వ్యాఖ్యానించారు.