"వైఎస్ చేస్తే.. నీ గొప్పంటావా?, పోలవరంలో బాబు అసమర్థత బయటపడింది"
హైదరాబాద్: కమీషన్లు తీసుకోవాలన్న ఆలోచన పక్కనపెట్టి పోలవరం ప్రాజెక్టు పనులపై దృష్టిసారించాలని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్, సీఎం చంద్రబాబును విమర్శించారు.
సోమవారం హైదరబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరంపై చంద్రబాబు ఇప్పటికైనా పునరాలోచన చేయాలని సూచించారు. పట్టిసీమ సాకు చెబుతూ ఇన్నాళ్లు పోలవరం ప్రాజెక్టును జాప్యం చేస్తూ వచ్చారని బుగ్గున ఆరోపించారు.
వైఎస్ఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని తన ఘనత లాగా చంద్రబాబు చూపించుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ ఉన్నప్పుడు తవ్విన కాలువల్లో నీళ్లు వదిలి అదేదో తన గొప్పగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.
పోలవరం అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇంత యాగీ చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరు చెప్పి రైతుల భూములు లాక్కుని వారిని మోసం చేశారన్నారు. పోలవరం నిర్మాణం విషయంలో చంద్రబాబు అసమర్థత బయటపడినందునా కేంద్రమే దీనిపై దృష్టి పెట్టాలని బుగ్గన సూచించారు.