చెత్తపన్ను చెల్లించకపోతే ఇంటిముందే పారేయండి-వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన వివాదాస్పద ఆదేశం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్నుపై వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చెత్త పన్ను విధింపుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా.. తాజాగా శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెత్త పన్నుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో చెత్త పన్ను సేకరణ కోసం ప్రభుత్వం విధించిన పన్నును శ్రీకాకుళంలో కొందరు చెల్లించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు... ఇవాళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెత్త పన్ను చెల్లించని వారి ఇళ్లముందే ఆ చెత్తను పారేయాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అదీ బహిరంగంగానే. ప్రభుత్వం విధిస్తున్న రూ. 100 చెత్త పన్ను చెల్లించకపోతే ఎలా, అలా చెల్లించనివారి ఇళ్ల దగ్గరే ఆ చెత్తను పారేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.
Recommended Video
శ్రీకాకుళం నగరంలో మంచినీటి పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ మేరకు చెత్త పన్ను కట్టని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.100 చెత్త పన్ను విధిస్తే రాద్ధాంతం దేనికని ఆయన ప్రశ్నించారు. అందులో పెద్ద విషయం ఏముందన్నారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని, ఇకపై పన్ను కట్టని వారి వారి చెత్త తీసుకెళ్లబోమని ధర్మాన తేల్చిచెప్పేశారు. చెత్త వారి ఇంటిముందే పోసేయాలని, అప్పుడు అనుభవిస్తే తెలుస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలకు డబ్బులు పంచాలి కానీ చెత్త పన్ను కట్టమని చెబితే ఎలా అంటూ ధర్మాన ప్రశ్నించారు. ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది, అదికారులు, నాయకులు చెత్త పన్ను కట్టించే దిశగా పని చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ధర్మాన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.