సీమకు అన్యాయం చేయొద్దు: 'కేసీఆర్తో చర్చించి మా వాటా మాకివ్వండి'
అమరావతి: రాయలసీమకు ఎన్ని నీళ్లు కావాలన్న దానిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అవగాహన లేదని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదిలి రాయలసీమకు అన్యాయం చేయొద్దని ఆరోపించారు.
విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేయడం ద్వారా ప్రాజెక్ట్లో ఉండాల్సిన కనీస 854 అడుగుల నీటిమట్టం లేకుండా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాయలసీమకు 200 టీఎంసీల నికర జలాలు కావాలని ఈ విషయంపై మంత్రి దేవినేని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు సర్కారు నిర్వాకం వల్లే గతేడాది రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కరువుతో అల్లాడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించుకుని రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు వద్దని, కృష్ణా జలాల్లో తమకు రావాల్సిన వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నీటి విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని సూచించారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం మూడు సార్లు ప్రారంభించినప్పటికీ, ఇప్పటికీ గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలవలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications