కోడెల కుటుంబ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి: వైసీపీ ఎమ్మెల్యే
విజయవాడ: స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబ అవినీతిపై విచారణ జరపించాలని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్.ఎస్.బి గనులు, పశుగ్రాసం కొనుగోళ్ల టెండర్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు.
కోడెల శివప్రసాద్ ట్యాగ్(కేఎస్టీ) పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని గోపిరెడ్డి ఆరోపించారు. 72ప్యాకేజీల కింద పనులను విభజించి టెండర్లు నిర్వహించారని, తమకు అనుకూలమైన వారికే టెండర్ ఫారమ్స్ ఇచ్చారని ఆరోపించారు. కోడెల కొడుకు నేత్రుత్వంలో అంతా కలిసి రింగ్గా మారారని.. 25-30శాతం ఎక్కువ కోట్ చేశారని అన్నారు.
సాధారణంగా 5శాతం ఎక్కువ కోట్ చేస్తేనే రివ్యూ కమిటీకి పంపుతారని, కానీ అంతకు చాలా రెట్లు అధికంగా కోట్ చేసినా రివ్యూ కమిటీకి పంపలేదని ఆయన ఆరోపించారు. టెండర్లు ఓపెన్ చేయకుండానే పనులు ప్రారంభించారని అన్నారు. నీటి పారుదల శాఖలో కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు అంతా కుమ్మక్కై వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
పశుగ్రాసం కొనుగోళ్లలోనూ అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గడ్డి కొనుగోలు కోసం ఒక్కో ఎకరానికి రూ.20వేలు చొప్పునా, రూ.7కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. అసలు ఆ గడ్డిని ఏ రైతు నుంచి కొనుగోలు చేశారు?.. ఏ రైతు పొలంలో గడ్డిని పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న గడ్డలు, గడ్డి కలిపి సైలేజ్ను తయారు చేస్తున్నారని, కేంద్రం దీనికి 50 శాతం సబ్సిడీ ఇస్తోందని గోపిరెడ్డి అన్నారు.
కోడెల కుమార్తె విజయలక్ష్మి సైలేజ్ యంత్రాలను పెట్టి ఈ సబ్సిడీని కాజేస్తున్నారని ఆరోపించారు. పశువులు తినలేని రైతులకు అంటగడుతున్నారని అన్నారు. కోడెల కుటుంబం అవినీతి హెచ్చుమీరిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.